పార్టీని వీడేందుకు 20 మంది ఎమ్మెల్యేలు రెడీ
సరైన నాయకుడు లేకపోవడంతో గుజరాత్ లో పార్టీ ఎమ్మెల్యేలలో తీవ్ర అసంతృప్తి నెలకొందని ఫలితంగా పార్టీ పట్ల ఆగ్రహంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. నాయకత్వ లక్షణాల్లో ప్రధాని మోదీతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని పోల్చలేమన్నారు.
అహ్మదాబాద్ : కాంగ్రెస్ పార్టీకి వరుస కష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో బొక్కబోర్లాపడ్డ కాంగ్రెస్ పార్టీ ఆ షాక్ నుంచి తేరుకోకముందే మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలు రాష్ట్రాల పీసీసీ చీఫ్ లు ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేస్తున్నారు.
ఇకపోతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ సైతం రాజీనామా చేశారు. ఇలాంటి తరునంలో కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటున్న వస్తున్న వార్తలు కాంగ్రెస్ పార్టీని కలవరపాటుకు గురి చేస్తున్నాయి.
ఎప్పుడు కర్ణాటక, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు కుప్పకూలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇకపోతే ప్రధాని నరేంద్రమోదీ అడ్డా గుజరాత్ లో సైతం కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలేలా ఉంది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు రెడీగా ఉన్నారంటూ కాంగ్రెస్ నేత, ఒబీసీ నాయకుడు అల్పేష్ ఠాకూర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం జాతీయ, రాష్ట్ర స్థాయిలో నాయకత్వ సమస్యను ఎదుర్కోంటుందని ఇలాంటి పరిస్థితే ఉంటే మరో పదేళ్లు అధికారానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి తప్పదని హెచ్చరించారు.
సరైన నాయకుడు లేకపోవడంతో గుజరాత్ లో పార్టీ ఎమ్మెల్యేలలో తీవ్ర అసంతృప్తి నెలకొందని ఫలితంగా పార్టీ పట్ల ఆగ్రహంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. నాయకత్వ లక్షణాల్లో ప్రధాని మోదీతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని పోల్చలేమన్నారు.
మోదీతో రాహుల్ సరితూగే వ్యక్తి కాదన్నారు. పటాన్ జిల్లా రతన్ పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన అల్పేష్ ఠాకూర్ లోక్ సభ ఎన్నికలకు ముందు పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.