ఆ నివేదికలు సరైనవే అయితే తీవ్రవైనవే: పెగాసెస్పై సుప్రీంకోర్టు ధర్మాసనం
పెగాసెస్ పై సుప్రీం కోర్టులో గురువారం నాడు విచారణ జరిగింది. జర్నలిస్టులు ఎన్.రామ్, శశికుమార్ ,ఎడిటర్స్ గిల్డ్ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం విచారణ చేసింది.మీడియా నివేదికలు నిజమైతే తీవ్రమైనవని కూడ ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
న్యూఢిల్లీ: పెగాసెస్పై మీడియా నివేదికలు సరైనవే అయితే తీవ్రమైనవేనని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. పెగాసెస్పై గురువారం నాడు సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది.సీనియర్ జర్నలిస్టులు ఎన్. రామ్, శశికుమార్ తో పాటు ఎడిటర్స్ గిల్డ్ వేర్వేరుగా ఈ విషయమై విచారణ కోరుతూ పిటిసన్లు దాఖలు చేశారు. మొత్తం 9 పిటిషన్లు ఈ అంశంపై దాఖలయ్యాయి.పిటిషనర్ల తరపున సీనియర్ అడ్వకేట్స్ కపిల్ సిబల్, రాకేష్ ద్వివేదిలు వాదించారు.
పెగాసెస్ సాఫ్ట్వేర్ ను కేంద్రం కొనుగోలు చేయకపోతే ఉపయోగించకూడదన్నారు. ఫోన్లో పెగాసెస్ సాఫ్ట్వేర్ ను ప్రవేశపెట్టాలంటే 55 వేల డాలర్ల ఖర్చు అవుతోందని సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.ఈ సాఫ్ట్వేర్ ను కేంద్రం కొనుగోలు చేయకపోతే ఎందుకు మౌనం ఉందని ఆయన ప్రశ్నించారు.
ఇది ఏ ఒక్కరికో పరిమితమైన అంశం కాదని సీనియర్ అడ్వకేట్ రాకేష్ ద్వివేది చెప్పారు.వాస్తవానికి ప్రభుత్వమే తనతంతట తానే ఈ విషయమై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.ఈ అంశంపై స్వతంత్ర దర్యాప్తు, నిజనిర్ధారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పలు సందేహాలను వ్యక్తం చేశారు. ఫోన్లు హ్యాకింగ్ కు గురైనట్టుగా మీరు ఫిర్యాదు చేశారా, ఎఫ్ఐఆర్ నమోదు చేయించారా అని పిటిషనర్ తరపు న్యాయవాదిని సీజేఐ ప్రశ్నించారు.
టెలిగ్రాఫ్ చట్టం ద్వారా కూడ ఫిర్యాదు చేయవచ్చని కూడ సీజేఐ పిటిషనర్ న్యాయవాదులను అడిగారు. పిటిషన్లను మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని సీజేఐ అభిప్రాయపడ్డారు.కచ్చితమైన సమాచారాన్ని జోడించాల్సిన అవసరం ఉందన్నారు సీజేఐ.పిటిషనర్లంతా పిటిషన్ ప్రతులను ప్రభుత్వానికి ఇవ్వాలని కోరారు.పిటిషన్లు వేసిన వారికి విషయంపై అవగాహన ఉందన్నారు. ప్రభుత్వం తరపున ఎవరైనా వాదనలు విన్పిస్తారా అని సీజేఐ ప్రశ్నించారు. జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది.