రాజద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 124 ఏ సెక్షన్ కింద కేసులు నమోదు చేయవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
న్యూఢిల్లీ: Sedition Act పై సుప్రీం కోర్టు స్టే విధించింది. రాజద్రోహం చట్టంపై ఉన్నత న్యాయస్థానం బుధవారం నాడు విచారణ నిర్వహించింది.Supreme Court దేశ ద్రోహ చట్టాన్ని నిలిపివేసింది. ఈ చట్టం కింద తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.తదుపరి విచారణ ముగిసే వరకు దేశద్రోహ అభియోగాల కింద FIR లు నమోదు చేయవద్దని సుప్రీంకోర్టు బుధవారం నాడు కేంద్రంతో పాటు రాష్ట్రాలను ఆదేశించింది.
పెండింగ్ లో ఉన్న అన్ని కేసులు, అప్పీళ్లు దేశద్రోహ నేరం కింద విధించిన అభియోగాలకు సంబంధించిన ప్రోసిడింగ్ లను ఉపసంహరించుకోవాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. మరో వైపు ఈ చట్టం కింద కొత్త కేసులు కూడా నమోదు చేయవద్దని కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజద్రోహం చట్టం సమీక్షించనున్న నేపథ్యంలో ఈ చట్టం కింద నమోదైన కసులు భవిష్యత్తుల్లో నమోదయ్యే కేసుల గురించి ప్రభుత్వం వైఖరిని కూడా స్పష్టం చేయాలని ఉన్నత న్యాయస్థానం కేంద్రాన్ని కోరింది.
దేశ వ్యాప్తంగా 800కి పైగా దేశ ద్రోహం కేసులు నమోదయ్యాయి. ఈ కేసు కింద 13 వేల మంది జైలుల్లో ఉన్నారని పిటిషనర్ల తరపు న్యాయవాది కపిల్ సిబల్ ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకు వచ్చారు.
దేశ ద్రోహం కింద అరెస్టైన వారు బెయిల్ కూడా ధరఖాస్తు చేసుకోవచ్చని కూడా కోర్టు తెలిపింది.ఈ చట్టం కింద కేసులు నమోదు చేయకుండా ఉండాలనే విధానం సరైంది కాదని కేంద్రం తరపున ఉన్నత న్యాయస్థానంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు.ప్రతి కేసు తీవ్రతను చెప్పలేమని సొలిసిటర్ జనరల్ చెప్పారు. ఎస్పీ ర్యాంక్ అధికారి ఆమోదిస్తేనే ఈ చట్టం కింద కేసు నమోదు చేసేలా మార్గదర్శకాలు రూపొందిస్తామని తుషార్ మెహతా చెప్పారు. పెండింగ్ కేసులను న్యాయపరమైన పోరమ్ ముందు పరిశీలించాలని కూడా మెహతా సుప్రీం ముందుంచారు.
పౌరుల హక్కులు, దేశ సమగ్రత మధ్య సమతుల్యం అవసరమని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. కేంద్రం వాదనతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించలేదు. దేశ ద్రోహం చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
హనుమాన్ చాలీసా పఠించినా రాజద్రోహం అభియోగాలు మోపుతున్నారని అటార్నీ జనరల్ ఆందోళన వ్యక్తం చేశారు.
తొలుత దేశద్రోహ సెక్షన్ కొనసాగాల్సిందేనని, ఈ అంశంపై 1962లో కేదార్నాథ్ సింగ్ కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పే అంతిమమని కేంద్రం వాదించింది. ఆ వెంటనే వైఖరిని మార్చుకున్న సంగతి తెలిసిందే. రాజద్రోహంపై పునరాలోచిస్తామని పేర్కొంటూ మరో అఫిడవిట్ను దాఖలుచేసింది. కాగా 2014-19 మధ్య దేశ ద్రోహం సెక్షన్ కింద దేశవ్యాప్తంగా 326 కేసులు నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో 6 కేసుల్లోనే శిక్షలు పడ్డాయి.
