కారులో కూర్చున్నవారందరూ సీటు బెల్టు పెట్టుకోవాలి.. లేదంటే ఫైన్: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మరణించిన తరుణంలో కారులో ప్రయాణిస్తున్న ప్రతి ప్రయాణికుడు సీటు బెల్టు ధరిచంచుకోవాలని, లేదంటే జరిమానా వధించాల్సి ఉంటుందని తెలిపారు.
న్యూఢిల్లీ: టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మరణించిన తర్వాత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అందరూ సీటు బెల్టు పెట్టుకోవాలని ఆదేశించారు. ఈ నిబంధన పాటించనిచో జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఓ మీడియా సంస్థ నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు. ఈ నిబంధన ఎప్పటి నుంచో ఉన్నదని, కానీ, ఎవరూ పాటించడం లేదని వివరించారు. ఈ నిబంధన ఉల్లంఘిస్తే కనీస జరిమానా రూ. 1000 ఉంటుందని తెలిపారు. ఈ జరిమానా మొత్తాన్ని ఆయా రాష్ట్రాలు నిర్ణయించుకుంటాయని వివరించారు.
సైరస్ మిస్త్రీ మరణం తర్వాత కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నదని నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రయాణికుల భద్రత కోసం ఓ నిర్ణయం తీసుకున్నదని, కారులో వెనుక కూర్చున్న ప్రయాణికులు కూడా సీటు బెల్టు ధరించాల్సిందేనని వివరించారు. బ్యాక్ సీటులోనూ సీట్ బుల్టులు అవసరం అని వివరించారు.
కారులో వెనుక సీట్లకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలకు రూపకల్పన చేస్తున్నదని ఇటీవలే కొన్ని మీడియా కథనాలు తెలిపాయి.
మోటార్ వెహికిల్ యాక్ట్ 1988 ప్రకారం, సీటు బెల్టు అందుబాటులో ఉన్న సీట్లలో కూర్చున్నవారు వాటిని ధరించేలా డ్రైవర్ జాగ్రత్తలు తీసుకోవాలి. వెనుక వరుసలో మధ్య సీటులో కూర్చున్నవారు కూడా తప్పకుండా సీటు బెల్టు పెట్టుకోవాలి.
ప్రస్తుతం మన దేశంలో ఎక్కువ కార్లలో మొదటి రెండు ఫ్రంట్ సీట్లలో, రెండు వెనుక సీట్లలో త్రీ పాయింట్ సీటు బెల్ట్ అదుబాటులో ఉన్నది. వెనుక వరుసలో మధ్య సీటులో ఉన్న బెల్టు త్రీ పాయింట్ కాకుండా కేవలం టూ పాయింట్ సీట్ బెల్టుగా ఉంటున్నది. కానీ, మన దేశంలో చాలా మంది కారులో ప్రయాణిస్తుండగా చాలా ముఖ్యమైన బెల్టులను పెద్దగా పట్టించుకోరు.