Akhilesh Yadav: తెలంగాణలోని రైతుల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ అన్నారు. రైతును కార్పొరేట్ సంస్థలకు లొంగదీసుకుంటున్న బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా భావసారూప్యత కలిగిన శక్తులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
Uttar Pradesh: ప్రస్తుతం వరి ధాన్యం చుట్టు రాజకీయాలు తిరుగుతున్నాయి. వరి ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ రైతుల పట్ల కేంద్రంలోని బీజేపీ సర్కారు నడుచుకుంటున్న తీరుపై ఆగ్రహం వ్యక్త చేస్తూ.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) రైతు నిరసనలను ప్రారంభించింది.కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతోంది. ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఢిల్లీ ఆ పార్టీ శ్రేణులతో కలిసి ధర్నాకు దిగారు. కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసనలకు దేశంలోని వివిద ప్రాంతాల రైతులు, రాజకీయ నాయకుల నుంచి మద్దతు లభిస్తోంది.
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తెలంగాణ రైతులకు, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రైతు నిరసనలకు మద్దతు తెలిపారు. తెలంగాణలోని రైతుల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. రైతును కార్పొరేట్ సంస్థలకు లొంగదీసుకుంటున్న బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా భావసారూప్యత కలిగిన శక్తులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావు (కేసీఆర్) చేపట్టిన ఆందోళనకు మద్దతుగా అఖిలేశ్ యాదవ్ ట్వీట్ చేస్తూ.. రైతు వ్యతిరేక ఆలోచనలు, విధానాలతో పాటు కేంద్ర ప్రభుత్వ దిగజారుడు విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి ధర్నాకు దిగడం బీజేపీ ప్రజా వ్యతిరేక పాలను స్పష్టం చేస్తున్నదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ విషయంలో చాలా అస్పష్టంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యం అనే పంట పోరాట నేలలో మాత్రమే పెరుగుతుంది!.. అంటూ పేర్కొన్నాడు.
కాగా, వరి సేకరణలో తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ చేస్తున్న పోరాటానికి వివిధ రాజకీయ పార్టీలు, రైతు సంఘాల నాయకులు మద్దతు పలుకుతున్నారు. ముఖ్యమంత్రి 24 గంటల గడువులోగా స్పందించాలంటూ కేంద్రాన్ని హెచ్చరించారు. దీనికి పలువురు నేతలతో పాటు సామాన్య ప్రజలు కూడా సోషల్ మీడియా ద్వారా తమ మద్దతును తెలియజేస్తున్నారు. అయితే, ధాన్యం కొనుగోలుపై అధికార పార్టీ టీఆర్ఎస్.. బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నదని భారతీయ జనతా పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
