కూలిపోయిన యుద్ధ విమానం.. రాజస్తాన్లో ప్రమాదం.. ఇద్దరు పైలట్లు దుర్మరణం!
రాజస్తాన్లోని బర్మార్ జిల్లాలో ఓ యుద్ధ విమానం గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో క్రాష్ అయింది. ఆ ప్రాంతం అగ్నిగుండంగా మారింది. ఆ విమానంలోని ఇద్దరు పైలట్లు దుర్మరణం చెందారు.
జైపూర్: రాజస్తాన్లో ఘోర ప్రమాదం సంభవించింది. భారత వాయుసేనకు చెందిన ఓ యుద్ధ విమానం నేలి కూలింది. యుద్ధ విమానం కూలిన ప్రాంతంలో మొత్తం మంటలు వ్యాపించాయి. సుమారు అర కిలోమీటర్ పరిధితో యుద్ధ విమాన శకలాలు ఎగిరిపడ్డాయి. ఈ ఘటన గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనలో విమానంలోని ఇద్దరు పైలట్లు దుర్మరణం చెందారు.
రాజస్తాన్లోని బర్మార్ జిల్లా భిందా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మిగ్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ కూలిన విషయం తెలియగానే వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర ఎయిర్ఫోర్స్ అధికారులు స్పాట్కు బయల్దేరారు.
ఇద్దరు పైలట్లు నడిపే మిగ్ 21 ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్ ఈ రోజు సాయంత్రం రాజస్తాన్లోని ఉతర్లాల్ ఎయిర్ బేస్ నుంచి బయల్దేరింది. సుమారు రాత్రి 9.10 గంటలకు ఈ విమానం ప్రమాదానికి గురైంది. బర్మార్ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని భారత వైమానిక దళం ధ్రువీకరించింది. ఆ విమానంలోని ఇద్దరు పైలట్లు మరణించినట్టు పేర్కొంది. పైలట్ల మరణాలపై ఐఏఎఫ్ తీవ్రంగా కలత చెందిందిన తెలిపింది. పైలట్ల కుటుంబాలకు అండగా నిలుస్తామని వివరించింది. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలను తెలుసుకోవడానికి కోర్టు దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసినట్టు ట్వీట్ చేసింది.
ఈ దుర్ఘటనపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. రాజస్తాన్లోని బర్మార్ జిల్లాలో మిగ్ 21 ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు (ఎయిర్ వారియర్లు) మరణించడం దిగ్భ్రాాంతికరం అని ట్వీట్ చేశాారు. దేశానికి వాారి సేవలను చిరస్మరణీయం అని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
బైతూ రీజియన్లో ఈ మిగ్ ఎయిర్క్రాఫ్ట్ ఓ ట్రిప్ వేసింది. ఈ సమయంలోనే విమానం నేలకూలింది. ఫ్లైట్ క్రాష్కు గల కారణాలు ఇంకా తెలియరాలేవు.