ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కొచ్చిన్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్  చేయాల్సి వచ్చింది. మొత్తం 193 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో అప్రమతమైన పైలెట్ అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. వివరాల్లోకెళ్తే.. షార్జా నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని ఆదివారం కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. విమానంలోని 'హైడ్రాలిక్స్' పని చేయడం ఆగిపోయిందని అనుమానిస్తున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రాత్రి 8.04 గంటలకు విమానాశ్రయంలో పూర్తి ఎమర్జెన్సీని ప్రకటించినట్లు కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (CIAL) ప్రతినిధి తెలిపారు. రాత్రి 8.26 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. రన్‌వేను అడ్డుకోలేదని, ఏ విమానాన్ని దారి మళ్లించలేదని చెప్పారు. రాత్రి 8.36 గంటలకు ఎమర్జెన్సీ ఆర్డర్ ఉపసంహరించబడింది. విమాన కార్యకలాపాలు సాధారణమైనవిగా ప్రకటించబడ్డాయి. విమానంలోని మొత్తం 193 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది సురక్షితంగా ఉన్నారని CIAL తెలిపింది.