46ఏళ్ల రికార్డు బ్రేక్.. రాజధానిలో భారీ వర్షం.. స్విమ్మింగ్ పూల్గా మారిన ఎయిర్పోర్టు.. వీడియో వైరల్
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి వెంటనే రోడ్లు సహా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ వరద వచ్చి చేరింది. ఎయిర్పోర్ట్ స్విమ్మింగ్ పూల్ను తలపించింది. ఢిల్లీలో 46 ఏళ్ల రికార్డు బ్రేక్ చేస్తూ కుండపోత వర్షం కురిసింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. శుక్రవారం నుంచే మొదలైన వర్షం శనివారం ఉదయం దాని ప్రతాపం చూపింది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం 8.30 గంటల వరకు 94.7 మిల్లిమీటర్ల వర్షం కురిసినట్టు సఫ్దార్జంగ్ అబ్జర్వేటరీ రికార్డు చేసింది. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో దారులన్నీ నీటమయమయ్యాయి. వాతావరణ శాఖ ఒక రోజుపాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు వర్షం కురిసే అవకాశముందని హెచ్చరించింది.
ఈ రోజు ఉదయం వర్షంతో ఢిల్లీలో మరో రికార్డు నమోదైంది. ఈ వర్షకాలంలో మొత్తం 1,100 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. చివరిసారిగా గరిష్టంగా 2003లో 1,050 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ రికార్డ్ బ్రేక్ చేసింది. దీంతో 1975(1,150 మిల్లీమీటర్లు) తర్వాత మళ్లీ అత్యధిక వర్షాలు ఈ ఏడాదే ఢిల్లీలో కురిసాయి. మరొక విషయం ఇంకా వర్ష కాలం ముగియనేలేదు.
ఈ రోజు ఉదయం కురిసిన వర్షాలతో రోడ్లే కాదు, విమానాశ్రయంలోనూ భారీగా వరద నీరు చేరింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం స్విమ్మింగ్ పూల్ను తలపించింది. ఎయిర్పోర్టు ఫోర్కోర్టులో వరద నీరు నిలిచింది. విమానాల రన్వేపైనా భారీగా నీరు చేరింది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ విషయాన్ని ఢిల్లీ ఎయిర్పోర్టు ధ్రువీకరించింది. ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నామని, ప్రస్తుతం ఆ నీటిని తొలగించామని ట్వీట్ చేసింది.