ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరిలో ఎంఐఎం.. అధికార పార్టీలపై అసద్దుదీన్ ఒవైసీ విమర్శలు
New Delhi: ఢిల్లీలోని ఆరవింద్ కేజ్రీవాల్ సర్కారు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలపై ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ మరోసారి విమర్శలు గుప్పించారు. 'గుజరాత్కు వెళ్లండి, ఢిల్లీలోని సీలంపూర్కు వెళ్లండి.. ఈ ప్రాంతాల్లో అభివృద్ధి జరగదు, పాఠశాలలు నిర్మించబడలేదు' అని ఆప్, బీజేపీలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.
Delhi Municipal Corporation Elections: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏఐఎంఐఎం (AIMIM) మొత్తం 15 మంది అభ్యర్థులను నిలబెట్టింది. ఈ అభ్యర్థులకు మద్దతుగా ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం ఢిల్లీలో మొత్తం 6 బహిరంగ సభలు నిర్వహించారు. ప్రచారం సందర్భంగా మూడు ప్రధాన పార్టీలైన బీజేపీ (బీజేపీ), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ (కాంగ్రెస్)లపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మమ్మల్ని ఓట్ల కోత పార్టీ అంటారు, అయితే మేము కేవలం 15 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్నాము, మిగిలిన 235 స్థానాలను గెలవకుండా ఎవరు ఆపారు అంటూ మండిపడ్డారు.
ఢిల్లీ ఎంసీడీ ఎన్నికల్లో మొత్తం 12 శాతం ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. వారి ఏకపక్ష వైఖరి కూడా ఎన్నికల ఫలితాల్లో పెద్ద మార్పును సూచించనుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 14 మంది ముస్లిం అభ్యర్థులతో సహా మొత్తం 15 మంది అభ్యర్థులను AIMIM నిలబెట్టింది. ముస్లిం మెజారిటీ స్థానాలైన మతియామహల్, సీలంపూర్, ముస్తఫాబాద్, బాబర్పూర్, బల్లిమారన్, సీమాపురి, చాందినీ చౌక్, జాకీర్ నగర్, కరవాల్ నగర్, అబూ ఫజల్ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను బరిలోకి దించింది.
ఢిల్లీ అల్లర్లపై సీఎం కేజ్రీవాల్పై విమర్శలు
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన అసదుద్దీన్ ఒవైసీ.. ఢిల్లీలో అల్లర్లు జరుగుతున్నప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కళ్లు, చెవులు మూసుకుని కూర్చున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఓడించాలనే పేరుతో మైనారిటీల నుండి ఓట్లు అడగడంపై మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తూ.. కరోనా మహమ్మారి సమయంలో ముస్లింలపై అనవసర ఆరోపణలు చేసి బ్లేమ్ చేశారని పేర్కొన్నారు. కరోనా సంక్షోభ సమయంలో తబ్లిఘి జమాత్పై ఆరోపణలు చేశారనీ, ముస్లింల పరువు తీశారని పేర్కొన్నారు. చాలా కష్ట సమయాల్లో, కోవిడ్ జాబితాను తయారు చేసినప్పుడు, తబ్లిఘి జమాత్ ప్రత్యేక జాబితా తయారు చేయబడిందని తెలిపారు. సీఎం కేజ్రీవాల్ కూడా తబ్లిఘి జమాత్పై ఆరోపణలు చేశారనీ, పూర్తి బాధ్యత ఢిల్లీ సీఎందేనని పేర్కొన్నారు.
ముస్లింల అభివృద్ధి మూడు పార్టీలకు ఇష్టం లేదు..
బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలను టార్గెట్ చేసిన అసదుద్దీన్ ఒవైసీ.. ఈ మూడు పార్టీలు దళితులు, ముస్లింల అభివృద్ధిని కోరుకోవడం లేదనీ కేవలం తమ ఓటు బ్యాంకు కోసమే వాడుకుంటున్నాయని ఆరోపించారు. ఇన్నాళ్లు కాంగ్రెస్, ఆప్లకు ఓటు వేసినా ఈ పార్టీలు మీకు ఏం చేశాయనీ, మీరు ఏం సాధించారని బహిరంగ సభకు హాజరైన ప్రజలను ఓవైసీ ప్రశ్నించారు.
ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ..
AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుండి ట్వీట్ ద్వారా ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. "ధన్యవాదాలు దిల్వాలే దిల్వాలే, బూటకపు మాటలు చెప్పే పార్టీలను తిరస్కరిస్తూ ఢిల్లీ ప్రజలు మజ్లిస్ను ఆదరిస్తున్నారనడానికి ఈ వేలాది మంది సభే నిదర్శనం. ఇన్షా అల్లా ఎంసీడీలో మజ్లిస్ జెండాను ఎగురవేస్తాం" అని అన్నారు.