Gyanvapi Masjid: జ్ఞానవాపి వివాదంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. వీహెచ్‌పీ ఆవిర్భావానికి ముందు సంఘ్ ఎజెండాలో అయోధ్య లేదని.. జ్ఞానవాపిపై భగవత్ ప్రసంగాన్ని విస్మరించరాదని అన్నారు.  

Gyanvapi Masjid: దేశ‌వ్యాప్తంగా జ్ఞానవాపి వివాదంపై చ‌ర్చ జ‌రుగుతోన్న త‌రుణంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్య‌ల‌పై సంచ‌ల‌న వ్యాఖ్యాలు చేసిన విష‌యం తెలిసిందే. ఆ వ్యాఖ్యాల‌ను ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. మోహన్ భగవత్‌ని టార్గెట్ చేస్తూ... జ్ఞానవాపిపై భగవత్ ప్రసంగాన్ని విస్మరించరాదని, వీహెచ్‌పీ ఆవిర్భావానికి ముందు సంఘ్ ఎజెండాలో అయోధ్య లేదని అన్నార‌నీ, చారిత్రక కారణాలతో బాబ్రీ వివాదంలో పాల్గొనమ‌ని చెప్ప‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాల‌ను గౌరవించని ఆర్ఎస్ఎస్... బాబ్రీ మసీదు కూల్చివేతలో పాలుపంచుకున్న‌దని అన్నారు. జ్ఞానవాపి విష‌యంలోనూ ఇదే విధానాన్ని అవలంబిస్తారా? అని ప్ర‌శ్నించారు. జ్ఞాన్‌వాపి వివాదంలో కొన్ని విశ్వాసాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయని, దానిపై కోర్టు నిర్ణయాన్ని అందరూ అంగీకరించాలని వరుస ట్వీట్‌లలో పేర్కొన్నారు. 

నేటి ముస్లింల పూర్వీకులు హిందువులే అయినప్పటికీ, రాజ్యాంగం ప్రకారం భారత పౌరులని పేర్కొన్నారు. పూర్వీకులను బలవంతంగా బౌద్ధమతంలోకి మార్చారని, ఎవరైనా చెప్పడం ప్రారంభిస్తే ఏమి జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. మోహన్ భగవత్ ఇస్లాం ఆక్రమణదారులు చెప్పారనీ.. నిజానికి.. ముస్లిం ఆక్రమణదారులు రాకముందే వ్యాపారులు, పండితులు, ఋషుల భార‌త్ కు వ‌చ్చార‌ని అన్నారు. దేశంలో శాంతి, సామరస్యాలు నెలకొనేందుకు బీజేపీ చీఫ్ జగత్ ప్రకాశ్ నడ్డా, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇచ్చిన హామీలను ఒవైసీ ప్రశ్నించారు. శాంతి, సామరస్యాలపై హామీ ఇవ్వడానికి మోహన్ లేదా నడ్డా ఎవరు? వారికి రాజ్యాంగబద్ధమైన పదవి లేర‌ని విమ‌ర్శించారు. ప్రార్థనా స్థలాల చట్టం-1991పై ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టమైన వివ‌ర‌ణ‌ ఇవ్వాలనీ. ప్ర‌ధాని రాజ్యాంగ‌బ‌ద్దంగా ప్రమాణం చేశారని, ఈ విష‌యంలో స‌రైన వివ‌ర‌ణ ఇవ్వాల‌ని అన్నారు. 

విశ్వహిందూ పరిషత్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థ) ఏర్పాటుకు ముందు సంఘ్‌ ఎజెండాలో అయోధ్య ఆలయం లేదని, 1989లో బీజేపీ పాలన్‌పూర్‌ తీర్మానంలో అయోధ్య ఎజెండా భాగమైందని అన్నారు. ఈ విష‌యంతో బీజేపీ ద్వంద విధాన అనుస‌రిస్తున్న‌ట్టు రుజువైందనీ, కాశీ, మధుర, కుతుబ్‌మీనార్‌ తదితర సమస్యలను లేవనెత్తిన విదూషకులందరికీ సంఘ్‌తో ప్రత్యక్ష సంబంధం ఉందని ఆరోపించారు. 
విశ్వహిందూ పరిషత్‌ను 1964లో ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు ఎంఎస్‌ గోల్వాల్కర్‌, ఎస్‌ఎస్‌ ఆప్టే లు ఏర్పాటు చేశారు. RSS సెప్టెంబర్ 1925లో ఏర్పడింది.

మోహన్ భగవత్ తన ప్రసంగంలో ఏం చెప్పారు?

జ్ఞాన్‌వాపి మసీదుపై వివాదం కొనసాగుతున్న త‌రుణంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ.. జ్ఞాన్‌వాపి వివాదం ఎప్ప‌టి నుంచో కొనసాగుతోందని, ఆ చరిత్రను మనం మార్చలేనిదని అన్నారు. ఈనాటి హిందువులు గానీ, ముస్లింలు గానీ ఈ వివాదాన్ని సృష్టించలేదనీ. ఆ ఘ‌ట‌న ఆ రోజుల్లోనే జరిగిందనీ,. ఇస్లాం మ‌తం.. ఇత‌ర దేశీయుల దండ‌యాత్ర వ‌ల్ల భార‌త్ లోకి వ‌చ్చింద‌నీ, ఆ స‌మయంలో అనేక హిందూ దేవాల‌యాలు నాశ‌న‌మ‌య్యాయని మోహ‌న్ భ‌గ‌వ‌త్ అన్నారు.

జ్ఞానవాపీ అంటే.. హిందూవుల‌కు ప్రత్యేకమైన భక్తి శ్రద్ధలు ఉన్నాయనీ, ఇది తరతరాల నుంచి వస్తోందనీ, కానీ ప్రతి మసీదులో శివలింగాన్ని ఎందుకు వెతకాలని భగవత్ అన్నారు. బయటి నుంచి వచ్చిన మతమైనా అది కూడా ఒక పూజా విధానమే. ఆ భక్తి మార్గాన్ని ఎంచుకున్న వారు ముస్లింలు అయ్యారు. అంతేకానీ వారేమీ బయటి వారు కాదు. ఈ విషయాన్ని ముస్లింలు కూడా అర్థం చేసుకోవాలనీ, హిందువులకు ప్రత్యేక భక్తి ఉన్న ప్రదేశాలపై ఎందుకు వివాదాన్నిపెంచాలని అన్నారు. ఇప్పుడు తమకు దేవాలయాల కోసం ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం లేదని.. భవిష్యత్తులోనూ హిందూ దేవాలయాల ఉద్యమాల్లో ఆర్‌ఎస్‌ఎస్ పాల్గొనదని మోహన్ భగవత్ చెప్పారు. 

హిందూవులకు ఇత‌రుల‌ పూజ విధానం పట్ల వ్యతిరేకత లేదని, హిందువులు వాటన్నింటినీ అంగీకరిస్తార‌నీ, అన్ని ర‌కాల మ‌తారాధన‌లు పవిత్ర‌మైన‌వ‌న్నారు. కొంద‌రు కొన్ని ర‌కాల ఆరాధ‌న‌ల‌ను ద‌త్త‌త తీసుకున్నార‌ని, కానీ అవ‌న్నీ మ‌న రుషులు, మునులు, క్ష‌త్రియుల నుంచి వ‌చ్చిన‌వే అన్నారు. మ‌న పూర్వీకులంతా ఒక్క‌టే అన్నారు. కొన్ని ప్ర‌దేశాల ప‌ట్ల ప్ర‌త్యేక భ‌క్తి ఉంద‌ని, వాటి గురించి మాట్లాడామ‌ని, కానీ ప్ర‌తి రోజు కొత్త విష‌యాన్ని బ‌య‌ట‌కు తీసుకురావ‌ద్ద‌న్నారు. హిందువులు ప్ర‌త్యేకంగా పూజించే అనేక ప్ర‌దేశాల్లో వివాదాలను సృష్టించార‌ని, హిందువులు... ముస్లింలకు వ్యతిరేకంగా ఎప్పుడూ ఆలోచించరనీ, నేటి ముస్లింల పూర్వీకులు కూడా ఆనాటి హిందువుల‌నీ.. మాన‌సిక ధైర్యాన్ని దెబ్బ‌తీసేందుకు వాళ్ల‌ను ఆరోజుల్లో దూరంగా ఉంచార‌ని, అందుకే హిందువులు త‌మ మ‌త‌ప‌ర‌మైన ప్ర‌దేశాల ర‌క్ష‌ణ కోరుతున్న‌ట్లు భ‌గ‌వ‌త్ వెల్ల‌డించారు.