ఎయిమ్స్ సర్వర్ హ్యాక్ చిన్న విషయం కాదు.. దీనివెనుక కుట్ర వుండవచ్చు.. : కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్
New Delhi: ఎయిమ్స్ సర్వర్ హ్యాక్ వెనుకు ఎదైనా కుట్రదాగి వుండవచ్చని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అనుమానం వ్యక్తం చేశారు. కాగా, అనేక మంది రోగుల సమాచారంతో పాటు, ఎయిమ్స్ సర్వర్ లో వీవీఐపీల డేటా కూడా ఉందనీ, సైబర్ హ్యాక్ నేపథ్యంలో ఈ డేటాతో ఏదైనా హాని కలిగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
IT Minister Rajeev Chandrashekhar: ఇటీవల దేశరాజధానిలో ఉన్న ఎయిమ్స్లో సర్వర్ హ్యాక్ కావడం చిన్న సంఘటన కాదనీ, దీని వెనుక కుట్ర దాగి ఉందని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అనుమానం వ్యక్తం చేశారు. అనేక మంది రోగుల సమాచారంతో పాటు, ఎయిమ్స్ సర్వర్ లో వీవీఐపీల డేటా కూడా ఉందనీ, సైబర్ హ్యాక్ నేపథ్యంలో ఈ డేటాతో ఏదైనా హాని కలిగించే అవకాశం ఉందని తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. శుక్రవారం నాడు కేంద్ర సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఎయిమ్స్ సర్వర్ హ్యాక్ వెనుకు ఎదైనా కుట్రదాడి వుండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఎయిమ్స్ సర్వర్ హ్యాక్ కేసును CERT (కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్), NIA (జాతీయ దర్యాప్తు సంస్థ), ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. అలాగే, రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పౌరుల డేటా గోప్యతను నిర్ధారించే ప్రయత్నంలో ప్రభుత్వం డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును తీసుకురాబోతోందని మంత్రి తెలిపారు. పౌరుడి గోప్యతకు భంగం కలగకుండా ఈ బిల్లు హామీ ఇస్తుందని చంద్రశేఖర్ గతంలో చెప్పారు. సర్వర్ హ్యాక్ కేసుకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఎయిమ్స్ పరిపాలనతో సంబంధం ఉన్న అధికారులతో పాటు, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎన్ఐసీ (NIC), జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), ఢిల్లీ పోలీసులు, MHA సీనియర్ సభ్యులతో సహా ఇతర అధికారులు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సమావేశానికి హాజరయ్యారు. త్వరలో ఎయిమ్స్ సర్వర్ సజావుగా పనిచేసేలా పునరుద్ధరిస్తామని ఎన్ఐసీ అధికారులు సమావేశంలో తెలిపారు. నివేదికల ప్రకారం, ఈ సంఘటనలో ఏదైనా ఉగ్రవాద కోణం ఉందా అనే దానిపై ఎన్ఐఏ దర్యాప్తు చేసే అవకాశం ఉంది. మూలాల ప్రకారం, అనేక మంది రోగుల సమాచారంతో పాటు, AIIMS సర్వర్లో VVIPల డేటా కూడా ఉంది. సైబర్ హ్యాక్ నేపథ్యంలో ఈ డేటా హాని కలిగించే అవకాశం ఉంది. దర్యాప్తు సంస్థల సూచన మేరకు ఎయిమ్స్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే.
ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In), హోం మంత్రిత్వ శాఖ అధికారులు, ఢిల్లీ పోలీసు బృందాలు ఇప్పటికే ransomware దాడిపై విచారణ జరుపుతున్నాయి. నవంబర్ 25న ఢిల్లీ పోలీస్లోని ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (IFSO) విభాగం సైబర్ టెర్రరిజం, దోపిడీ కేసును నమోదు చేసింది. కాగా, ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఇ-హాస్పిటల్ సర్వర్పై గతవారం సైబర్ దాడి జరిగింది. రెండు రోజులు గడిచినా పరిస్థితి సద్దుమణగ లేదు. ఈ దాడితో ఓపీడీ, నమూనా సేకరణ సేవలతో పాటు, ఆపరేషన్లు వంటి ఇతర సేవలు ప్రభావితమయ్యాయి. ransomware సైబర్ దాడి కారణంగా బ్యాకప్ సిస్టమ్పై కూడా ప్రభావితం అయినట్టు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.సైబర్ దాడితో పలు ప్రాథమిక ఆంశాలు మారినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈ సంఘటన ను ransomware దాడి అనీ, దీనిలో ఆన్లైన్ సేవలకు ప్రాప్యతను పునరుద్ధరించడానికి హ్యాకర్లు డబ్బు డిమాండ్ చేశారని మీడియాకు నివేదించింది.