గుజరాత్లో ప్రధాని మోడీ ర్యాలీలో భద్రతా లోపం.. నో ఫ్లయింగ్ జోన్లో డ్రోన్, ముగ్గురు అరెస్టు
Ahmedabad: అహ్మదాబాద్ జిల్లాలోని బావ్లా గ్రామంలో ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలీ జరిగే వేదిక సమీపంలో కెమెరా అమర్చిన డ్రోన్ను ఎగురవేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వ్యక్తులను గురువారం అరెస్టు చేశారు.
PM Modi-Security lapse: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు. అయితే, తాజాగా ఆయన ఎన్నిల ప్రచార ర్యాలీలో భద్రతా లోపం వెలుగుచూసింది. ప్రధాని పర్యటన సందర్భంగా నో ఫ్లయింగ్ జోన్ లో డ్రోన్ ఎగిరింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకెళ్తే.. అహ్మదాబాద్ జిల్లాలోని బావ్లా గ్రామంలో ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలీ జరిగే వేదిక సమీపంలో కెమెరా అమర్చిన డ్రోన్ను ఎగురవేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వ్యక్తులను గురువారం అరెస్టు చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ప్రచారంలో భాగంగా గ్రామంలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ ప్రసంగించారు. భద్రతా కారణాల దృష్ట్యా వేదిక దగ్గర డ్రోన్ల ఎగురవేయడాన్ని జిల్లా కలెక్టర్ నిషేధించారు. అయితే, ర్యాలీకి ముందు, అక్కడకు చేరిన ప్రజా గుంపు దృశ్యాలను తీయడానికి రిమోట్-నియంత్రిత డ్రోన్ను ఉపయోగిస్తున్న కొంతమంది వ్యక్తులను పోలీసులు గుర్తించారని స్థానిక పోలీసు అధికారి ఇన్స్పెక్టర్ భరత్ పటేల్ తెలిపారు.
"ఈ ముగ్గురు స్థానిక వ్యక్తులు వారి వ్యక్తిగత ప్రయోజనం కోసం ప్రచార ర్యాలీకోసం అక్కడకు చేరుకున్న ప్రజా గుంపు విజువల్స్ను రికార్డు చేస్తున్నారు. అయితే, డ్రోన్ ఎగురవేతపై ఆంక్షలు విధించబడ్డాయి. నిబంధనలకు విరుద్దంగా వారు నడుచుకున్నారు. మేము వారిపై ఐపీసీ సెక్షన్ 188 (అధికారిక ఆదేశాలను ఉల్లంఘించడం) కింద కేసు బుక్ చేసాము" అని ఆయన చెప్పారు.
“ఈరోజు (గురువారం) 24/11/2022న అహ్మదాబాద్లోని బావ్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తున్న బహిరంగ సభ జరుగుతున్నప్పుడు, సభా స్థలం సమీపంలోని ప్రధాన రహదారి నుండి ముగ్గురు వ్యక్తులు డ్రోన్ కెమెరా ద్వారా వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. 23/11/2022 నాటి సీరియల్ నంబర్ 77/2022 నోటిఫికేషన్ ద్వారా అహ్మదాబాద్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ద్వారా సభకు సమీపంలోని రెండు కిలోమీటర్ల ప్రాంతమంతా “నో డ్రోన్ ఫ్లైయింగ్ జోన్” అని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారు” అని పోలీసు స్టేట్మెంట్ పేర్కొంది. అలాగే, “16:30 గంటలకు అహ్మదాబాద్ రూరల్లోని స్థానిక క్రైమ్ బ్రాంచ్కు చెందిన ఒక పోలీసు కానిస్టేబుల్ అనుప్ సిన్ భరత్సంగ్, సభా మైదానం సమీపంలోని ప్రధాన రహదారి నుండి మైక్రోడ్రోన్ను నడుపుతున్న కొంతమంది వ్యక్తులను గుర్తించారు. డ్రోన్ ఆపరేటర్లను పట్టుకునీ, డ్రోన్ను తీయమని కోరడంతో, ముగ్గురు వ్యక్తులు దానికి కట్టుబడి డ్రోన్ను కిందకు దించారు”అని పేర్కొంది.
బీడీడీఎస్ బృందం వెంటనే డ్రోన్ను తనిఖీ చేసి, డ్రోన్ కేవలం చిత్రీకరణ కోసం మాత్రమేననీ, ఆపరేటింగ్ కెమెరాను కలిగి ఉందనీ, దానిలో ఎటువంటి పేలుడు పదార్థాలు లేదా ఇతర హానికరమైన వస్తువులు లేవని నిర్ధారించారు. నిందితుల వద్ద ఎటువంటి నిషేధిత వస్తువులు కనుగొనబడలేదు. వారు డ్రోన్ను ఆపరేట్ చేస్తున్నప్పుడు వారు సభ ప్రహరీ గోడ వెలుపల ఉన్నారని పేర్కొంది. పై ఘటనలో భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 188 ప్రకారం కింది ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడి వివరాలు పేర్కొంటూ.. ముగ్గురు నిందితులు అహ్మదాబాద్ లోని ఓధన్ నివాసితులని పోలీసు రిపోర్టు పేర్కొంది. నిందితులైన నికుల్ రమేష్భాయ్ పర్మార్ వయస్సు 24 కాగా, రాకేష్ కాళూభాయ్ భర్వద్ వయస్సు 35, రాజేష్కుమార్ మంగీలాల్ ప్రజాపతి వయస్సు 20 ఏండ్లుగా పేర్కొంది.