Agnipath scheme: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో మూడో పిటిషన్ దాఖలు అయింది. సంబంధిత పిటిషన్లు అగ్నిపథ్ స్కీమ్ ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
Agnipath scheme protests: అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే ఈ స్కీమ్ వ్యతిరేక నిసనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే పలువురు నిరసనకారులు దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్లు సైతం నమోదుచేశారు. సాయుధ బలగాల కోసం కొత్త అగ్నిపథ్ రిక్రూట్మెంట్ పథకాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మూడో పిటిషన్ దాఖలైంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో నిరసనల మధ్య, ఇప్పుడు ఈ అంశం సుప్రీం కోర్టుకు చేరుకుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి సుప్రీంకోర్టు విచారణపై పడింది. న్యాయస్థానం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేస్తూ.. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కేంద్రం పక్షం కూడా వినాలని కోరింది. సోమవారం నాడు న్యాయవాది హర్ష్ అజయ్సింగ్ కూడా పిటిషన్ వేసి, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు.
అగ్నిపథ్ పథకం కింద 4 సంవత్సరాల పాటు సైన్యంలో యువతను రిక్రూట్ చేసుకుంటున్నారని, ఆ తర్వాత 25% మంది అగ్నివీరులను మాత్రమే పర్మినెంట్ చేస్తారని న్యాయవాది హర్ష్ తన రిట్ పిటిషన్లో పేర్కొన్నారు . అగ్నివీర్లు నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు స్వీయ-క్రమశిక్షణను కొనసాగించడానికి వృత్తిపరంగా లేదా వ్యక్తిగతంగా పరిపక్వం చెందరని మరియు వారు తప్పుదారి పట్టవచ్చని వాదించారు. మొదటి రెండు పిటిషన్లను న్యాయవాదులు విశాల్ తివారీ, మనోహర్ లాల్ శర్మ దాఖలు చేశారు. అంతకుముందు న్యాయవాది మనోహర్ లాల్ శర్మ.. అగ్నిపథ్ పథకాన్ని సవాలు చేస్తూ తన పిటిషన్లో, పార్లమెంటు అనుమతి లేకుండా దశాబ్దాల నాటి ఆర్మీ రిక్రూట్మెంట్ విధానాన్ని ప్రభుత్వం మార్చిందని, ఇది రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని ఆరోపించారు. సైన్యంలో అధికారులకు శాశ్వత కమిషన్ ఉందని, వారు 60 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేయవచ్చని ఆయన చెప్పారు. షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సి) కింద ఆర్మీలో చేరిన వారికి 10-14 ఏళ్ల పాటు సేవలందించే అవకాశం ఉంది.
అందుకు విరుద్ధంగా యువతను కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగించేందుకు ప్రభుత్వం ఇప్పుడు అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంతో యువత భవిష్యత్తు అంధకారంగా మారుతోంది. ఎక్కడికక్కడ ప్రదర్శనలు జరుగుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, జూన్ 14 నాటి ఆర్డర్ మరియు నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని పేర్కొన్నారు. జూన్ 18న, న్యాయవాది విశాల్ తివారీ అగ్నిపథ్ హింసాకాండ కేసుపై సిట్ దర్యాప్తు కోసం అభ్యర్థిస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దానిని పరిశీలించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలావుండగా, అగ్నిపథ్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిని వెనక్కి తీసుకోవాలనీ, ఇంతకుముందులానే ఆర్మీ నియామకలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలావుండగా, అగ్నిపథ్ రిక్రూట్మెంట్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ సత్యాగ్రహం చేశారు. రాష్ట్రపతిని కూడా కలవనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ నిరసనల నేపథ్యంలో ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లు మూతపడటంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
