ఓబీసీ బిల్లు, ది జనరల్‌ ఇన్సూరెన్స్‌ బిజినెస్‌ (నేషనలైజేషన్‌) సవరణ బిల్లు-2021కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఓబీసీ బిల్లు ద్వారా దేశంలో 671 కులాలు రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందనున్నాయని కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ చెప్పారు.  

ఓబీసీ బిల్లుకు పార్లమెంట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఓబీసీల జాబితా రూపకల్పనలో రాష్ట్రాలకు గతంలో ఉన్న అధికారాలను పునరుద్ధరించడానికి వీలు కల్పించే 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఇప్పటికే లోక్‌సభ ఆమోదం తెలిపింది. తాజాగా బధవారం రాజ్యసభలో సైతం విపక్ష సభ్యులు ఏకతాటిపైకొచ్చి ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు. రాజ్యసభలో ఈ బిల్లును సామాజిక న్యాయం-సాధికారత శాఖ మంత్రి వీరేంద్రకుమార్‌ ప్రవేశపెట్టారు. బిల్లు ఆమోదం అనంతరం ప్రధాని మోదీ సహా వివిధ పార్టీల నేతలకు కేంద్ర మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఇదొక చరిత్రాత్మక అడుగు అని, దేశంలో 671 కులాలు దీనిద్వారా రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందనున్నాయని వీరేంద్ర కుమార్ చెప్పారు.

మరోవైపు ప్రభుత్వరంగ బీమా సంస్థలను ప్రైవేటీకరించేందుకు వీలుగా తీసుకొచ్చిన ‘‘ ది జనరల్‌ ఇన్సూరెన్స్‌ బిజినెస్‌ (నేషనలైజేషన్‌)’’ సవరణ బిల్లు-2021కు సైతం పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. లోక్‌సభలో ఆగస్టు 2న ఈ బిల్లుకు ఆమోదం లభించగా.. బుధవారం విపక్షాల ఆందోళన నడుమ రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. తృణమూల్‌, డీఎంకే, వామపక్ష పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. సెలక్ట్‌ కమిటీకి పంపాలని పట్టుబడ్డాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ బిల్లును ప్రతిపాదించగా.. నిరసనలే మధ్య మూజువాణి ఓటుతో ఈ బిల్లుకు ఆమోద ముద్ర పడింది.