Karnataka Old Mosque Row: కర్నాటకలోని పాత మసీదు పునరుద్ధరణ పనులు జరుగుతున్నప్పుడు మే 21న మసీదు లోపల దేవాలయం లాంటి నిర్మాణం ఉందనే వార్తల నేపథ్యంలో ఈ రచ్చ మొదలైంది.
Karnataka : దేశంలో మతపరమైన స్థలాలకు సంబంధించి వివాదాలు ఒకదాని తర్వాత ఒకటి తెరమీదకు వస్తూ.. ఉద్రిక్త వాతావరణం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లోని జ్ఙానవాపి మసీదు లోపల శివలింగం ఉందనే వివాదం తీవ్ర ఉద్రిక్తలకు దారి తీసింది. సుప్రీంకోర్టు సైతం ఇందులో జోక్యం చేసుకుంది. ఈ వివాదం హిందూ-ముస్లిం వర్గాల మధ్య విభజనను మరింతగా పెంచుతోందనే ఆందోళనలు క్రమంగా అధికం అవుతున్నాయి. ఇంకా జ్ఙానవాపి మసీదు వివాదం ఓ కొలిక్కి రాకముందే కర్నాటకలో మరో మసీదు వివాదం తెరమీదకు వచ్చి.. రచ్చ చేస్తోంది. యూపీలోని జ్ఙానవాపి మసీదుకు సంబంధించిన మాదిరిగానే కర్నాటకలోని పాత మసీదు పై వివాదం రాజుకుంది. అక్కడ విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు పూజలు సైతం చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొన్నది.
వివరాల్లోకెళ్తే.. కర్నాటక రాష్ట్రంలోని మంగుళూరు లో ఉన్న పాత మసీదు కింద హిందూ దేవాలయం లాంటి నిర్మాణ డిజైన్ కనుగొనబడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రదేశంలో విశ్వహిందూ పరిషత్ తన కార్యక్రమాలను ప్రారంభించింది. వీహెచ్పీ కార్యకర్తలు అక్కడ పూజలు చేస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలోనే ఆలయం చుట్టూ పోలీసు భద్రతను పెంచారు.
మంగళూరు పాత మసీదు ప్రాంతంలో 144 సెక్షన్ !
చాలా మంది విశ్వహిందూ పరిషత్ (VHP) కార్యకర్తలు కర్నాటకలోని మంగళూరు పాత మసీదు వెలుపలికి చేరుకుని రచ్చ చేస్తున్నారు. ఇది హిందూ దేవాలయం అంటూ నినాదాలు చేశారు. వీరంతా పాత మసీదులో పూజలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు మసీదు వెలుపల పూజలు చేశారు. దీంతో అక్కడి రెండు వర్గాల మధ్య ఇది ఉద్రిక్తలకు దారి తీసింది. ఈ క్రమంలోనే మసీదు ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం.. వీహెచ్పీ కార్యకర్తల ఆందోళనల దృష్ట్యా ఆ ప్రాంతమంతా 144 సెక్షన్ విధించారు.పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు అక్కడ మోహరించారు. 500 మీటర్ల పరిధిలో గుమికూడేందుకు అనుమతి లేదని ఉత్తర్వులు జారీ చేశారు.
పాత మసీదు వివాదం ఎలా మొదలైంది?
మంగళూరు పాత మసీదు చాలా క్రితం కట్టారు. అయితే, దీనికి సంబంధించి అక్కడి నిర్వాహకులు కొన్ని పనులు చేస్తున్నారు. ఈ పాత మసీదు పునరుద్ధరణ పనులు జరుగుతున్నప్పుడు మే 21న ఈ మొత్తం వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ సమయంలో మసీదు లోపల దేవాలయం లాంటి నిర్మాణం ఉందని పలువురు పేర్కొన్నట్టు వార్తలు వచ్చాయి. తక్కువ సమయంలో అక్కడ ఈ వార్తలు వ్యాపించాయి. ఆ తర్వాత విశ్వహిందూ పరిషత్ ఈ మొత్తం అంశాన్ని లేవనెత్తడంతో రచ్చ మొదలైంది. ఇప్పుడు జ్ఞానవాపి లాగే మంగళూరు పాత మసీదుపై విషయంపై రచ్చ జరుగుతోంది. ఆలయాన్ని కూల్చివేసి ఈ మసీదును నిర్మించారని వీహెచ్పీ ఆరోపిస్తోంది. దీన్ని నిరూపించుకునేందుకు తాము కోర్టుకు కూడా వెళ్లవచ్చని వీహెచ్పీ చెబుతోంది. అంతే కాకుండా మసీదులో సర్వే చేయాలని హిందూ సంస్థ డిమాండ్ చేస్తోంది.
ఇప్పుడు ఈ విషయం రాజకీయ రంగు పులుముకుంది. వీహెచ్పీతో పాటు ఇప్పుడు బీజేపీ కూడా ఈ మసీదుకు సంబంధించి పెద్ద డిమాండ్ చేసింది. మసీదు సర్వే చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ప్రస్తుతం మసీదుకు భద్రతను పెంచడంతో పాటు ఎవరినీ ఇక్కడికి వెళ్లనివ్వలేదు. వీరంగం సృష్టించిన కొంతమంది వీహెచ్పీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.