లాయర్ ఇందిర జైసింగ్ పై భగ్గుమన్న నిర్భయ తల్లి ఆశాదేవి
దోషులను క్షమించాలని కోరిన సీనియర్ న్యాయవాది ఇందిర జైసింగ్ మీద నిర్భయ తల్లి ఆశాదేవి భగ్గుమన్నారు. సోనియా గాంధీ మార్గంలో నడిచి దోషులను క్షమించాలని ఇందిరా జైసింగ్ ఆశాదేవిని కోరారు.
న్యూఢిల్లీ: సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ పై నిర్భయ తల్లి ఆశాదేవి భగ్గుమన్నారు. నిర్భయ కేసులోని దోషులను క్షమించాలని ఇందిరా జైసింగ్ కోరారు. దానిపై ఆశాదేవి తీవ్రంగా ప్రతిస్పందించారు.
నలుగురు దోషులకు ఉరిశిక్షను అమలు చేసే తేదీని వాయిదా వేయడంపై ఆశాదేవి శుక్రవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆశాదేవి అసంతృప్తి వ్యక్తం చేసిన వెంటనే దోషులను క్షమించాలని జైసింగ్ ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.
ఆశాదేవి బాధను తాను పూర్తిగా అర్థం చేసుకోగలనని, అయితే రాజీవ్ గాంధీ కేసులో దోషి నళినిని సోనియా గాంధీ క్షమించినట్లుగానే ఆశాదేవి తన కూతురు గ్యాంగ్ రేప్, హత్య కేసులో దోషులను క్షమించాలని జైసింగ్ అన్నారు. ఆశాదేవితో మమేకతను తాను ప్రకటిస్తున్నానని, అయితే తాము మరణశిక్షకు వ్యతిరేకమని ఆమె అన్నారు.