హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఈ రోజు వాదనలు విన్నది. ఈ విచారణలో పిటిషనర్ తరఫు న్యాయవాది దేవదత్ కామత్ ఆసక్తికర వాదనలు చేశారు. తన వాదనలో దక్షిణాఫ్రికాలోని ఓ కోర్టు ఇచ్చిన తీర్పును పేర్కొన్నారు. అలాగే, టర్కీ రాజ్యాంగాన్ని ప్రస్తావిస్తూ.. మన రాజ్యాంగం పాజిటివ్ సెక్యూలరిజం గలదని వాదించారు.
బెంగళూరు: దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన హిజాబ్ వివాదం(Hijab Conroversy)పై ఈ రోజు కర్ణాటక హైకోర్టు(Karnataka High Court) వాదనలు విన్నది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితు రాజ్ అవస్తీ సారథ్యంలోని న్యాయమూర్తులు క్రిష్ణ దీక్షిత్, జేఎం ఖాజిల త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఈ రోజు విచారణలో ఆసక్తికర వాదనలు వచ్చాయి. దక్షిణాఫ్రికాలోని ఓ కోర్టు వెలువరించిన తీర్పును, మతాలకు సంబంధించి టర్కీ రాజ్యాంగానికి, మన దేశ రాజ్యాంగానికి ఉన్న మౌలిక తేడాలు వంటి విషయాలను పిటిషనర్ తరఫు న్యాయవాది దేవదత్ కామత్ ప్రస్తావించారు. ఈ రోజు వాదనలు విన్న త్రిసభ్య ధర్మాసనం విచారణను రేపటికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు మళ్లీ ఈ పిటిషన్ను విచారించనుంది.
అడ్వకేట్ దేవదత్ వాదిస్తూ.. హిజాబ్ గురించి తాము కొంత హోం వర్క్ చేశామని, ఈ అంశంపై ఇతర దేశాల న్యాయస్థానాలు ఎలా స్పందించాయో కొన్ని చూచాయగా ప్రస్తావిస్తానని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన దక్షిణాఫ్రికాలోని(South Africa) ఓ కోర్టు తీర్పును పేర్కొన్నారు. అక్కడి విద్యా సంస్థలో యూనిఫామ్ ఉన్నప్పటికీ కొన్ని మినహాయింపులను ఇవ్వడానికే కోర్టు మొగ్గు చూపిందని అన్నారు. మన దేశానికి చెందిన ఓ హిందూ బాలిక దక్షిణాఫ్రికా స్కూల్లో ముక్కు పుడక పెట్టుకోవడానికి అనుమతులు కోరాల్సి వచ్చిందని వివరించారు. అక్కడ ప్రత్యేకంగా యూనిఫామ్స్ ఉన్నా.. ఇందుకు కోర్టు సమ్మతించిందని తెలిపారు. మినహాయింపు కావాలని కోరినవారిని దండించకుండా.. అందుకు అనుమతులు ఇచ్చిందని పేర్కొన్నారు.
అదే సమయంలో అడ్వకేట్ దేవదత్ కామత్ టర్కీ(Turkey) రాజ్యాంగాన్ని కూడా ప్రస్తావించారు. మన రాజ్యాంగం పాజిటివ్ సెక్యూలరిజాన్ని పాటిస్తే.. కాగా, టర్కీ రాజ్యాంగం నెగెటివ్ సెక్యూలరిజాన్ని పాటిస్తుందని అన్నారు. టర్కీ దేశం మతపరమైన సంకేతాలు, గుర్తులు ఏవీ బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించవద్దని చెబుతుందని వివరించారు. ఆ కోణంలోనే మన న్యాయస్థానం హిజాబ్ ధరించవద్దని మధ్యంతర ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. కానీ, వారి రాజ్యాంగం పూర్తిగా విభిన్నమైనదని అన్నారు. మన రాజ్యాంగం అన్ని మతాలను గుర్తిస్తుందని తెలిపారు. మనది పాజిటివ్ సెక్యూలరిజం అని, వారికి నెగెటివ్ సెక్యూలరిజం అని వాదించారు. ఈ వాదనలు విన్న త్రిసభ్య ధర్మాసనం విచారణను రేపటికి వాయిదా వేసింది.
ధ్యప్రదేశ్ లోని ఓ విద్యాసంస్థ.. ప్రాంగణంలోకి మతపరమైన సంబంధం కలిగిన దుస్తులు ధరించి రావడానికి అనుమతి లేదని పేర్కొంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సర్క్యూలర్ ను జారీ చేసింది. మధ్య ప్రదేశ్లోని దతియా జిల్లాలోని అగ్రని ప్రభుత్వ అటానమస్ పీజీ కళాశాల సోమవారం విద్యార్థులు 'మతానికి సంబంధించిన' దుస్తులు ధరించకుండా ఉండాలని కోరుతూ సర్క్యులర్ జారీ చేసింది. కాలేజ్ ప్రాంగణంలో హిజాబ్ ధరించిన ఇద్దరు విద్యార్థులు రావడంతో పలువురు యువకులు.. కాషాయ కండువాలు ధరించి నిరసన తెలిపారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే సదరు కాళాశాల యాజమాన్యం సర్క్యూలర్ జారీ చేసింది. గతంలో ఎంకామ్ విద్యార్థిని కళాశాల ఆవరణలో హిజాబ్ ధరించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
