బిహార్ ఎన్నికల ఫలితంపై సోనూసూద్ ఆసక్తికర వ్యాఖ్యలు
బీహార్ ప్రజలు మంచి కోసం ఎదురుచూస్తున్నారని... ఈ మంచి ఎన్డిఎ కూటమి వల్లే సాధ్యమని నమ్మినట్లున్నారని సినీనటుడు సోనూ సూద్ అన్నారు.
హైదరాబాద్: ఇటీవలే వెలువడిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సినీ నటుడు సోనూ సూద్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. బిజెపి, జెడియూ పార్టీల కూటమి విజయం సాధించి మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమయ్యాయని... ఈ నిర్ణయం తీసుకున్నందుకు గర్వపడుతున్నామని ఐదేళ్ల తర్వాత ప్రజలు అనుకుంటారని నమ్ముతున్నట్లు సోనూసూద్ పేర్కొన్నారు.
బీహార్ ప్రజలు మంచి కోసం ఎదురుచూస్తున్నారని... ఈ మంచి ఎన్డిఎ కూటమి వల్లే సాధ్యమని నమ్మినట్లున్నారని అన్నారు. దేశ ప్రజల మాదిరిగానే బీహార్ ప్రజలు కూడా ఎన్డీయేకు మరోసారి అవకాశం ఇచ్చారని అన్నారు. తమ జీవితాలు మరింత మెరుగవ్వాలనే ఉద్దేశంతోనే ఈ అవకాశం ఇచ్చి వుంటారన్నాడు. ఎవరు గెలిచినా రాష్ట్ర ప్రజల జీవనం, స్థితిగతులు మారడమే ముఖ్యమని సోనూసూద్ పేర్కొన్నాడు.
read more బీహార్లో ఘోర పరాజయం: కాంగ్రెస్లో మరోసారి అసమ్మతి, గాంధీ కుటుంబంపై ప్రశ్నలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో 74 అసెంబ్లీ స్థానాలను బీజేపీ గెలుచుకొంది. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) 43 స్థానాలకే పరిమితమైంది. బీహార్ లో జేడీ(యూ), బీజేపీ కంటే తక్కువ స్థానాలను గెలుపొందింది. ఈ ఎన్నికల్లో బీజేపీ, జేడీ(యూ)లు కలిసి పోటీ చేశాయి. చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని ఎల్ జే పీ కేవలం ఒక్క సీటును గెలుచుకొంది.
ఇక తేజస్వి యాదవ్ సారథ్యంలో ఆర్జెడి పార్టీ 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి 75 అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకొంది. కాంగ్రెస్ పార్టీ 70 సీట్లలో పోటీ చేసి కేవలం 19 స్థానాల్లో మాత్రమే గెలిచింది. సీపీఐఎంఎల్ 19 సీట్లలో పోటీ చేసి 12 స్థానాల్లో గెలిచింది.