పౌరసత్వ సవరణ బిల్లుపై కమల్ హాసన్ ఆగ్రహం: రోగంలేని వ్యక్తికి ఆపరేషన్ అంటూ.....
వ్యాధి లేని వ్యక్తికి ఆపరేషన్ చేయడం ఎంత నేరమో కేంద్రం చేయనున్న చట్టం కూడా అంతే నేరమని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. ఇకపోతే వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ బిల్లును బుధవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.
చెన్నై: వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుపై సినీనటుడు, మక్కల్ నీధిమయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ బిల్లు నేరంతో సమానమంటూ కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు.
కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు ఏ రోగం లేని వ్యక్తికి ఆపరేషన్ చేసినట్లు ఉందని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. కేవలం ఏ ఒక్క వర్గంపై పక్షపాత ధోరణి లేని భారత్ కోసం తాము ప్రయత్నిస్తున్నట్లు కమల్ స్పష్టం చేశారు.
భారత రాజ్యాంగంలో ఎలాంటి తప్పుఒప్పులున్నా సరియేయడానికి తాము ప్రయత్నిస్తామని వ్యాఖ్యానించారు. వ్యాధి లేని వ్యక్తికి ఆపరేషన్ చేయడం ఎంత నేరమో కేంద్రం చేయనున్న చట్టం కూడా అంతే నేరమని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు.
ఇకపోతే వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ బిల్లును బుధవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. దేశంలో ముస్లింలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, వారంతా దేశ పౌరులుగానే కొనసాగుతారని అమిత్ షా భరోసా ఇచ్చారు.
పౌరసత్వ సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకమనే దుష్ర్పచారం సాగుతోందని, ఇది సత్యదూరమని అమిత్ షా స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లు దేశంలోని ముస్లింలకు వ్యతిరేకం కాదని తేల్చిచెప్పారు.
భారత్లో ముస్లింలు ఎలాంటి అభద్రతా భావానికి లోను కావాల్సిన అవసరం లేదని, వారంతా ఇక ముందూ ఈ దేశంలో భద్రంగా జీవించవచ్చని తెలిపారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మకుండా భరోసాతో జీవించాలని, భయపడాల్సిన అవసరం లేదని అమిత్ షా స్పష్టం చేశారు.
ఇకపోతే వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందగా బుధవారం రాజ్యసభలో ప్రవేశపెట్టిన తరుణంలో బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అటు రాజకీయంగా పలు పార్టీలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.