తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కిన నేపథ్యంలో నేషనల్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో పార్టీలో నెం.2 పొజిషన్ నుంచి అభిషేక్ బెనర్జీను తొలగిస్తారా? లేదా? అని చాలా మంది ఆసక్తిగా చూశారు. అయితే, మమతా బెనర్జీ.. మేనల్లుడు అభిషేక్ బెనర్జీని ఎప్పట్లాగే పార్టీ నేషనల్ జనరల్ సెక్రెటరీగా కొనసాగడానికే ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 

కోల్‌‌కతా: తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) పార్టీలో అంతర్గత విభేదాలు (Internal Rift) చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. పార్టీ చీఫ్ మమతా బెనర్జీ (Mamata Banerjee), ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee)ల మధ్య చీలికలు వచ్చినట్టు వార్తలు గుప్పుమన్నాయి. వీరిద్దరికీ ప్రత్యేక గ్రూపులు ఏర్పడ్డాయనే కథనాలు వచ్చాయి. వన్ మ్యాన్ వన్ పొజిషన్ అని అభిషేక్ బెనర్జీ వర్గం గట్టిగా వాదిస్తుండటంతో విభేదాలు ముదిరాయని తెలిసింది. మమతా బెనర్జీ శిబిరంలో పార్టీ సీనియర్ నేతలు ఉన్నారని, అందులో ఒకటి కంటె ఎక్కువ పొజిషన్లు మెయింటెయిన్ చేస్తున్నవారే అధికం. అందుకే అభిషేక్ బెనర్జీ తెస్తున్న వాదనలపై వారు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు. అంతర్గతంగా ఈ గొడవలు పెరుగుతున్న తరుణంలో మమతా బెనర్జీ పార్టీ అత్యున్న బాడీ తృణమూల్ పార్టీకి చెందిన నేషనల్ వర్కింగ్ కమిటీని పునర్వ్యవస్థీకరించడానికి సమావేశం నిర్వహించింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ సమావేశం నేపథ్యంలోనే అభిషేక్ బెనర్జీ పార్టీలో నెంబర్ 2 పొజిషన్‌లోనే కొనసాగుతారా? లేక మమతా బెనర్జీ ఆయనపై వేటు వేస్తారా? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే, ఈ సమావేశంలో మమతా బెనర్జీ తన మేనల్లుడిని కాదనలేదు. ఆయన ఎప్పట్లాగే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రెటరీగా కొనసాగనున్నారు. అభిషేక్ బెనర్జీ పొజిషన్‌పై ఎలాంటి మార్పు లేదు. దీంతో ఆయన ఎప్పట్లాగే నెంబర్ 2 స్థానంలో కొనసాగనున్నారు.

టీఎంసీ చీఫ్ ఇప్పుడు మమతా బెనర్జీ. ప్రస్తుతానికి ఆమె తర్వాత పార్టీలో నెంబర్ 2... అభిషేక్ బెనర్జీనే. అయితే, అభిషేక్ బెనర్జీ పట్టుపడుతున్న ఓ ప్రతిపాదన పార్టీలోని సీనియర్లు కలవరపెడుతున్నది. ‘వన్ మ్యాన్ వన్ పోస్టు’ అనే పాలసీని కచ్చితంగా అమలు చేసి తీరాలనేది అభిషేక్ బెనర్జీ వాదన. కొంతకాలంగా దీన్ని బలంగా వాదిస్తున్నారు. కానీ, పార్టీలో ఒకటి కంటే ఎక్కువ పోస్టులు కలిగి ఉన్న సీనియర్ నేతలకు ఈ ప్రతిపాదన మింగుడుపడటం లేదు.

ఇటీవలే స్థానిక సంస్థల ఎన్నికల కోసం టీఎంసీలోనే అభ్యర్థుల రెండు జాబితాలు రావడం చర్చనీయాంశం అయింది. అభిషేక్ బెనర్జీ యువ రక్తం డిమాండ్లను బలంగా వాదిస్తుండగా.. ఈ తరుణంలోనే మమతా బెనర్జీ సీనియర్ల వైపు మొగ్గారు. ఇలాంటి వర్గపోరులను పరిష్కరించడానికి లేదా పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించడానికి మమతా బెనర్జీ ఓ చిన్న కమిటీ వేసింది. ఈ కమిటీతో మమతా బెనర్జీ సమావేశం అయ్యారు. ఆ తర్వాతే ఆమె పార్టీ అత్యున్నత కమిటీలో ఉండబోయే వారి పేర్లను ప్రకటించారు. 20 సభ్యులతో కూడిన జాతీయ వర్కింగ్ కమిటీని దీదీ వెల్లడించారు. ఇందులో అమిత్ మిత్ర, పార్థ చటర్జీ, సుబ్రతా బక్షి, సుదీప్ బంధోపాధ్యాయ్, అనుబ్రతా మొండల్, అరూప్ బిశ్వాస్ మొదలైనవారితోపాటు అభిషేక్ బెనర్జీ పేరు కూడా ఉన్నది. కానీ, నేషనల్ జనరల్ సెక్రెటరీ పోస్టుపై సస్పెన్షన్ ఉండింది. కానీ, తాజా సమావేశంలో ఆ సస్పెన్స్‌కు తెర వీడింది. అభిషేక్ బెనర్జీనే టీఎంసీ నేషనల్ జనరల్ సెక్రెటరీగా కొనసాగనున్నారని స్పష్టమైంది.