అబ్ కీ బార్ కిసాన్ సర్కార్.. నాగలి పట్టడమే కాదు రైతులు చట్టాలు రాయాలి : మహా బీఆర్ఎస్ సభలో కేసీఆర్
Nanded: మహారాష్ట్రలోని నాందేడ్లో భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఖమ్మంలో జరిగిన మెగా ర్యాలీ తర్వాత బీఆర్ఎస్ నిర్వహిస్తున్న రెండో భారీ బహిరంగ సభ ఇది. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. అనేక నదులు మహారాష్ట్ర గుండా ప్రవహిస్తున్నప్పటికీ, ఇక్కడి రైతులు ఇంత పెద్ద సంఖ్యలో చనిపోవడం బాధాకరమని పేర్కొన్నారు.

BRS Rally Maharashtra: భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్లో భారీ ర్యాలీని నిర్వహించింది. పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) బహిరంగ సభలో ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. "స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా ప్రజలకు తాగునీరు, సాగునీరు అందడం లేదన్నారు. ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి, ఏం చేశాయి? మహారాష్ట్రలో చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం నాకు చాలా బాధ కలిగించింది. ఎన్నో నదులు ప్రవహిస్తున్న ఇలా రైతులు ఆత్మహత్యాలు చేసుకోవడం ఎంతో బాధిస్తోంది" అని కేసీఆర్ అన్నారు.
"అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ (ఈ సారి రైతు ప్రభుత్వం) అని చెబుతూ.. ఇప్పుడు జాతీయ స్థాయికి వెళ్లాలని అన్నారు. ఇప్పుడు పెద్ద మార్పు అవసరం. చాలా మంది వచ్చి సుదీర్ఘ ప్రసంగాలు చేసి వెళ్లిపోతారు. వాళ్ళు తమ మనసులోని మాట మాట్లాడుకుని వెళ్ళిపోతారు. 75 ఏళ్లు గడిచినా దేశానికి నీళ్లు, కరెంటు రావడం లేదు. ఖాళీ దేశంలో ప్రసంగం సాగుతోంది, రైతును ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో మార్పు రావాలి" అని కేసీఆర్ అన్నారు.
మేక్ ఇన్ ఇండియా జోక్ !
మహారాష్ట్ర సభలో కేసీఆర్ ఇంకా మాట్లాడుతూ.. నేడు మేక్ ఇన్ ఇండియా ఒక జోక్గా మారిందని అన్నారు. "వారి మేక్ ఇన్ ఇండియా ఎక్కడికి పోయింది? అన్నీ చైనా నుంచే వస్తున్నాయి. ప్రతి వీధిలో చైనా మార్కెట్ ఉంది. మేక్ ఇన్ ఇండియా ఉంటే చైనా మార్కెట్కు బదులు ఇండియా మార్కెట్ను ఏర్పాటు చేయాలి. మీరు కిసాన్ సర్కార్, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే రెండేళ్లలో దేశానికి వెలుగు వస్తుంది" అని కేసీఆర్ అన్నారు.
నాగలితో దున్నడమే కాదు.. రైతులు చట్టాలు రాయాలి.. అమలు చేయాలి !
మహారాష్ట్ర రైతులకు తెలంగాణ మోడల్ రైతు సంక్షేమాన్ని ప్రకటించి, అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా 24/7 విద్యుత్ సరఫరా, రైతు బీమా వంటి విధానాలను అమలు చేస్తామని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కే చంద్రశేఖర్రావు అన్నారు. మహారాష్ట్ర రైతులు తమ పొలాల్లో నాగలిని నడపడంతో పాటు చట్టాలు రాయడం, అమలు చేయడం నేర్చుకోవాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు. “నా ప్రియమైన రైతు సోదరులారా, చాలా సమయం గడిచిపోయింది. మీరు సహాయం కోసం చాలా సమయం వేచి ఉన్నారు. ఇప్పటి వరకు, మీరు ఇతరులు చట్టాలు రాయడానికి వీలుగా నాగలిని నడిపారు. ఇప్పుడు మీరు నాగలిని నడపడానికి మాత్రమే కాకుండా, చట్టాలు రాయడానికి.. వాటిని అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉండండి” అని కేసీఆర్ అన్నారు.
BRS నినాదం 'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్'
తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై పొరుగు రాష్ట్రంలోని పలు గ్రామాలను తెలంగాణలో కలపాలని కేసీఆర్ ర్యాలీకి ముందు చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ నినాదం 'అబ్కీ బార్ కిసాన్ సర్కార్' అని ఇటీవల కేసీఆర్ అన్నారు.
బీఆర్ఎస్ రెండవ భారీ బహిరంగ సభ
నాందేడ్లో జరిగిన ఈ ర్యాలీ తెలంగాణ వెలుపల BRS మొదటి పెద్ద బహిరంగ సభ. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు బీఆర్ఎస్ తెలిపింది. ర్యాలీకి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు. నాందేడ్ చేరుకున్న బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్కు పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. తొలుత నాందేడ్లోని గురుద్వారాలో కేసీఆర్ పూజలు చేశారు. గత జనవరి నెలలో తెలంగాణలోని ఖమ్మంలో జరిగిన మెగా ర్యాలీ తర్వాత బీఆర్ఎస్ నిర్వహిస్తున్న రెండో భారీ బహిరంగ సభ ఇది.
తొలుత ఖమ్మంలో బీఆర్ఎస్ మెగా సభ
ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు ప్రతిపక్ష నేతలు ఖమ్మం ర్యాలీలో పాల్గొన్నారు. నాందేడ్లోని వేదికపై పార్టీ జెండాలు, హోర్డింగ్లు, బెలూన్లు, పోస్టర్లతో గులాబీ రంగుతో విస్తృత ఏర్పాట్లు చేశారు.