ఆత్మ నిర్భర భారత్ జాతీయ స్పూర్తి: మన్కీ బాత్లో మోడీ
ఆత్మ నిర్భర భారత్ కేవలం భారత ప్రయత్నం కాదని ఇది భారత జాతీయ స్పూర్తి అని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు.
న్యూఢిల్లీ: ఆత్మ నిర్భర భారత్ కేవలం భారత ప్రయత్నం కాదని ఇది భారత జాతీయ స్పూర్తి అని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు.
ఆదివారం నాడు మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.రానున్న రోజుల్లో వేసవి కాలం వచ్చే అవకాశం ఉన్నందున నీటి సంరక్షణ పట్ల ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను తెలుసుకోవాలని ఆయన కోరారు.రానున్న రోజుల్లో కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ వర్షం నీటిని ఒడిసిపట్టుకొనే కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు క్యాచ్ ది రెయిన్ అనే ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నట్టుగా మోడీ చెప్పారు.
ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడంతో పాటు వర్షం నీటిని ఒడిసిపట్టేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. తమిళనాడు రాష్ట్రంలో ఓ గ్రామంలో భూగర్భ జలాలను కాపాడుకొనేందుకు గ్రామస్తులు చేసిన కృషిని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఇవాళ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో సైన్స్ అభివృద్దికి సీవీ రామన్ చేసిన కృషిని ఆయన గుర్తు చేశారు. ఆత్మ నిర్భర్ భారత్ లో సైన్స్ సహకారం కూడ ప్రబలంగా ఉందన్నారు.
లడ్డాఖ్ లో ఎత్తైన ప్రాంతంలో సేంద్రీయ విధానంలో వ్యవసాయం చేస్తున్న రైతు ఉర్గోద్ పుత్సంగ్ ఆయన మోడీ అభినందించారు. దేశ యువతలోని ప్రయోగాత్మక స్పూర్తిని ప్రశంసించిన రవిదాస్ నేటి యువతను చూస్తే ఎంతో చెందేవారన్నారు.
ఆత్మ నిర్భర్ భారత్ కు చాలా మంది సహకరిస్తున్నారన్నారు. ఇందుకు బీహార్ లోని బెట్టియాకు చెందిన ప్రమోద్ జీ సరైన ఉదహరణగా ఆయన పేర్కొన్నారు. గతంలో ఢిల్లీలోని ఎల్ఈడీ బల్బుల పరిశ్రమలో పనిచేసేవాడన్నారు.. ప్రస్తుతం తన గ్రామంలోనే ఆయన ఎల్ఈడీ బల్బుల తయారీ పరిశ్రమను స్థాపించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన భాషగా పేరున్న తమిళం నేర్చుకోలేకపోయినందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు మోడీ. తమిళ సాహిత్యం ఎంతో అద్భుతంగా ఉంటుందని ఆయన అభినందించారు.