మోడీ సర్కారుకు వ్యతిరేకంగా ఆప్ పోరాటం.. కేజ్రీవాల్ కు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మద్దతు
Ranchi: జార్ఖండ్ సీఎం, జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్- ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఇతర ఆప్ నేతలను రాంచీలోని తన నివాసానికి ఆహ్వానించారు. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా మద్దతు కోరుతూ కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా బీజేపీయేతర సీఎంలను కలుస్తున్నారు.

Hemant Soren Extends Support To Kejriwal: దేశ రాజధానిలో సేవల నియంత్రణపై ఆర్డినెన్స్ పై కేంద్రంతో ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మద్దతు తెలిపారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. తాము దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నామనీ, అన్ని పార్టీల నుంచి మంచి సహకారం లభించిందన్నారు. ఈ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చిన హేమంత్ సోరెన్ కు, ఆయన పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఆర్డినెన్స్ ను వ్యతిరేకించాలని ఇతర పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నానని కేజ్రీవాల్ పేర్కొన్నారు. వర్షాకాల సమావేశాల్లో ఈ ఆర్డినెన్స్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారని సమాచారం. బీజేపీకి లోక్ సభలో మెజారిటీ ఉంది కానీ రాజ్యసభలో లేదు. కాబట్టి బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమైతే ఈ ఆర్డినెన్స్ ను ఓడించవచ్చు. ఇది కేవలం ఢిల్లీకి సంబంధించినది మాత్రమే కాదనీ, దేశ సమాఖ్య సూత్రాలకు సంబంధించినదని ఆయన అన్నారు.
ఇరువురు నేతల భేటీ అనంతరం సోరెన్ మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్రాన్ని టార్గెట్ చేశారు. "కేంద్ర ప్రభుత్వం సమాఖ్య వ్యవస్థ గురించి మాట్లాడుతుంది.. అదే సమయంలో పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో మిత్రపక్షాలు కాని పార్టీలు దాదాపు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని స్పష్టమవుతోంది. ఇది ఆందోళన కలిగించే అంశమే... అని సోరెన్ చెప్పినట్టు వార్తా సంస్థ ఏఎన్ఐ నివేదించింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర మాజీ సిఎం ఉద్ధవ్ ఠాక్రే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్, బీహార్ సిఎం నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ లను కలిశారు. అలాగే, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ను కూడా కలిశారు.
ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం స్వాతంత్య్ర పోరాటం లాంటిదని కేజ్రీవాల్ అభివర్ణించారు.
ఈ ఆర్డినెన్స్ను పార్లమెంటులో సమిష్టిగా ఓడించాలి, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య విరుద్ధం, సమాఖ్య నిర్మాణానికి-రాజ్యాంగానికి విరుద్ధం. ప్రజల ప్రజాస్వామిక హక్కులను అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతించబోము : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్