పంజాబ్లో ఆపరేషన్ లోటస్.. ఎమ్మెల్యేకు రూ. 25 కోట్ల ఆఫర్.. మంత్రి సంచలన ఆరోపణలు
ఢిల్లీలో బీజేపీ ఆపరేషన్ లోటస్ ఫెయిల్ అయిన తర్వాత ఇప్పుడు పంజాబ్లో దాన్ని అమలు చేయ ప్రయత్నిస్తున్నారని భగవంత్ మాన్ ప్రభుత్వం ఆరోపించింది. ఆప్ ఎమ్మెల్యేకు ఒక్కొక్కరికి రూ. 25 కోట్ల ఆఫర్ బీజేపీ చేస్తున్నదని మంత్రి హర్పాల్ చీమా ఆరోపణలు చేశారు.
న్యూఢిల్లీ: పంజాబ్ ప్రభుత్వం కూడా ఆపరేషన్ లోటస్ ఆరోపణలు చేసింది. ఢిల్లీలో ఫెయిల్ అయిన బీజేపీ.. ఆపరేషన్ లోటస్ను ఇప్పుడు పంజాబ్లో అమలు చేస్తున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఈ ఆరోపణలను మాత్రం బీజేపీ తిప్పికొట్టింది. ఆప్లోనే చీలికలు వచ్చే సంకేతాలను ఈ ప్రకటన తెలియజేస్తున్నదని పేర్కొంది.
అధికార పార్టీ ఎమ్మెల్యేలను లోబరుచుకుని బీజేపీ తనలోకి లాక్కుంటున్నదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీన్నే అవి ఆపరేషన్ లోటస్గా వ్యవహరిస్తాయి.
పంజాబ్ ఎమ్మెల్యేలనూ బీజేపీ అప్రోచ్ అయిందని పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ చీమా ఆరోపించారు. ఢిల్లీకి వారిని రమ్మన్నారని, పెద్ద నేతలతో కలిపిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఒక ఆప్ ఎమ్మెల్యేలకు ఇలా చెప్పడానికి ఓ కాల్ వచ్చిందని వివరించారు. బీజేపీ ఒక్క ఎమ్మెల్యేలకు రూ. 25 కోట్లు ఆఫర్ ఇస్తున్నదని, వాటిని తీసుకుని ఆ ఎమ్మెల్యే బీజేపీలోకి మారాలనేది వారి ప్లాన్ అని ఆరోపించారు. ఆపరేషన్ లోటస్ కర్ణాటకలో విజయవంతం అయిందేమో... కానీ, ఢిల్లీ ఎమ్మెల్యేలు వారి కుట్రలను పారనివ్వలేదని పేర్కొన్నారు. ఢిల్లీలో ఆపరేషన్ లోటస్ ఫెయిల్ అయిందని వివరించారు.
పంజాబ్లో ప్రభుత్వం మారితే.. ఎమ్మెల్యేలకు పెద్ద పెద్ద ఆఫర్లు, పెద్ద ప్రమోషన్లు, పోస్టులు ఉంటాయని తమ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి ప్రలోభ పెట్టారని ఆయన వివరించారు. భగవంత్ మాన్ సారథ్యంలోని ప్రభుత్వాన్ని కూల్చేయాలని చాలా మంది తమ ఎమ్మెల్యేకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు.
అయితే, ఎంత మందికి ఈ కాల్స్ వచ్చినట్టు విలేకరులు అడిగారు. ఇందుకు సమాధానంగా సుమారు పది మంది వరకు కాల్స్ వచ్చాయని వివరించారు. గత వారం రోజుల నుంచి బీజేపీ నేతలు తమ ఎమ్మెల్యేలను కొనాలని విఫల ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. వారు సుమారు ఏడుగురు నుంచి పది మంది వరకు ఆప్ ఎమ్మెల్యేలను అప్రోచ్ అయ్యారని వివరించారు. ఇందుకు సంబంధించిన ప్రూఫ్లను సరైన సమయంలో వెల్లడిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఈ పరిస్థితి గురించి లీగల్ కోణాల్లో ఆప్ ఆలోచిస్తున్నదని వివరించారు.
ఢిల్లీలో తమ ఎమ్మెల్యేను బీజేపీ ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించిందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవలే ఆరోపణలు సంధించిన సంగతి తెలిసిందే. ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 కోట్లు ఇవ్వజూపారని వివరించారు.