మహారాష్ట్రపై కన్నేసిన ఆప్.. అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ ప్రకటన
Mumbai: మహారాష్ట్రలో జరిగే చిన్న, పెద్ద ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రకటించింది. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ పూర్తి శక్తితో పోరాడుతుందని ఆ పార్టీ మహారాష్ట్ర యూనిట్ చీఫ్ ప్రీతి శర్మ మీనన్ తెలిపారు.
Maharashtra Aam Aadmi Party: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ (ఆప్) జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత మరింత దూకుడుగా ముందుకుసాగడానికి ప్రణాళిలకలు సిద్ధం చేసుకుంటోంది. తన విస్తరణ పనుల్లో భాగంగా దేశంలోని ఇతర చాలా రాష్ట్రాల్లో రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నట్టు ఇప్పటికే ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక మహారాష్ట్రలోనూ ఆప్ దూకుడు పెంచాలని చూస్తోంది. మహారాష్ట్రలో జరిగే చిన్న, పెద్ద ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రకటించింది. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ పూర్తి శక్తితో పోరాడుతుందని ఆ పార్టీ మహారాష్ట్ర యూనిట్ చీఫ్ ప్రీతి శర్మ మీనన్ తెలిపారు. అలాగే, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పూర్తి స్థాయి సంస్థను ఏర్పాటు చేసి మహారాష్ట్రలో అన్ని చిన్న, పెద్ద ఎన్నికలలో పోటీ చేస్తుందని పార్టీ నాయకుడు గోపాల్ ఇటాలియా సోమవారం చెప్పారు.
విద్య, ఆరోగ్యం, విద్యుత్, నీరు, రోడ్లు, పరిశుభ్రత వంటి అంశాలపై ఆమ్ ఆద్మీ పార్టీ పోరాడుతుందని మీనన్ తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ మార్గదర్శకత్వంలో మహారాష్ట్రలో పూర్తి స్థాయి పార్టీ సంస్థను ఏర్పాటు చేస్తామని, రాష్ట్రంలోని అన్ని పెద్ద, చిన్న ఎన్నికల్లో పూర్తి బలంతో పోటీ చేస్తామని పార్టీ జాతీయ సంయుక్త కార్యదర్శి, మహారాష్ట్ర ఇన్చార్జ్ గోపాల్ ఇటాలియా చెప్పారు. దేశ ఆర్థిక రాజధాని ముంబయివాసుల సమస్యలను పరిష్కరించడంలో అధికారంలో ఉన్న పార్టీతో పాటు మరే పార్టీ సీరియస్ గా లేదని ఆరోపించిన ఆయన.. ప్రజలకు ఇప్పుడు ఆప్ రూపంలో ప్రత్యామ్నాయం ఉందని అన్నారు. ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 13 శాతం ఓట్లు సాధించి జాతీయ పార్టీగా అవతరించిందని తెలిపారు. అలాగే, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగుతేని విజయం సాధించి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు.
గుజరాత్ లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఐదు స్థానాలను గెలుచుకుని జాతీయ పార్టీ హోదాను సంపాదించిందని గుర్తు చేశారు. అనేక సంవత్సరాలు అధికారంలో ఉన్న ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ నుండి భారతీయ జనతా పార్టీని కూడా ఆప్ తొలగించిందన్నారు. ఈ విజయాలతో దేశవ్యాప్తంగా ఆప్ కొత్త ఆశలను, కొత్త అంచనాలను సృష్టించిందని తెలిపారు. మహారాష్ట్రలో చాలా పార్టీలు, చాలా మంది నాయకులు ఉన్నారు, కానీ దాని పౌరుల కోసం ఎవరూ పనిచేయడం లేదని ఆరోపించిన ఆయన.. ప్రజలు దేవుని దయలో మిగిలిపోయారు.. నిస్సహాయంగా ఉన్నారని గోపాల్ ఇటాలియా అన్నారు.
కాగా, అంతకుముందు మహారాష్ట్ర సర్కారుపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు గుప్పించింది. ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థ మహావితారాన్ ను ప్రయివేటు సంస్థ అదానీ గ్రూపునకు అప్పగించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సోమవారం ఆరోపించింది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ముంబై, థానే, నాసిక్, రాయగఢ్ తదితర జిల్లాల్లో విద్యుత్ కార్మికులు తలపెట్టిన సమ్మెకు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ముంబై యూనిట్ ప్రెసిడెంట్, ఆప్ జాతీయ కార్యనిర్వాహక సభ్యురాలు ప్రీతి శర్మ మీనన్ ఒక ప్రకటనలో తెలిపారు.