Goa Assembly Election 2022" బీజేపీ ఆశలన్నీ కాంగ్రెస్ పార్టీపైనే.. ఓటర్లపై కాదు: కేజ్రీవాల్ విమర్శలు
గోవాలో కాంగ్రెస్, ఆప్ల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది. బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చడమే ఆప్ చేస్తున్న పని అని కాంగ్రెస్ విమర్శించింది. దీనికి కౌంటర్గా ఆప్ అధినేత కేజ్రీవాల్ స్పందించారు. ఏడవకండి సార్.. బీజేపీ ఆశలన్నీ కాంగ్రెస్పైనే ఉన్నాయని విమర్శించారు. కాంగ్రెస్కు వేసే ఓటు.. బీజేపీకి చేరుతున్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్కు చెందిన 17 ఎమ్మెల్యేల్లో 15 మంది ఇప్పుడు బీజేపీలో ఉన్నారని వివరించారు.
పనాజీ: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇక్కడ అధికార పార్టీ బీజేపీతోపాటు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆప్ల మధ్య వ్యాఖ్యలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ పార్టీతో తృణమూల్ కాంగ్రెస్, ఆప్ల మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. మొన్నటి వరకు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ల మధ్య ఘాటుగా వ్యాఖ్యలు చేసుకుంటుంటే.. ఇప్పుడు ఆప్, కాంగ్రెస్ పార్టీల మధ్య విమర్శలు.. ప్రతి విమర్శలు పెరుగుతున్నాయి. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆశలు గోవా ప్రజలపై కాదు.. కాంగ్రెస్ పార్టీపై అని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
గోవాలో కాంగ్రెస్, బీజేపీల మధ్యనే అసలైన పోటీ ఉన్నదని ఇటీవలే కాంగ్రెస సీనియర్ నేత, గోవా ఎన్నికల పర్యవేక్షకుడు పి చిదంబరం ట్వీట్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం.. బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చే పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఇదే పనిలో ఉన్నారని వివరించారు. గోవాలో అసలైన పోరు కాంగ్రెస్, బీజేపీల మధ్యనే ఉన్నదని తెలిపారు. దీనిపై ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు.
‘సర్.. మీరు ఏడవడం ఆపండి’ అంటూ విమర్శలు ప్రారంభించారు. అరరే.. నేను చచ్చిపోయానురో.. మా ఓట్లు చీల్చేశాడురో అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఇదంతా వ్యర్థం అనే విధంగా తెలిపారు. ఎక్కడ ఆశ కనపడుతుందో.. వారికే గోవా ప్రజలు ఓట్లు వేస్తారని వివరించారు. బీజేపీ ఆశలన్నీ కాంగ్రెస్పైనే ఉన్నారని, గోవా ప్రజలపై కాదని విమర్శించారు. కాంగ్రెస్కు చెందిన 17 ఎమ్మెల్యేలలో 15 ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారని తెలిపారు. కాంగ్రెస్కు పడే ఓటు భద్రంగా బీజేపీకి బదలాయించడంలో ఆ పార్టీ కట్టుబడి ఉన్నదని విమర్శలు చేశారు. బీజేపీకి వేసే ఓటు కాంగ్రెస్ ద్వారా ఆ పార్టీకి చేరుతాయని తెలిపారు.
గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి మెజార్టీ రాకుంటే.. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆప్ సిద్ధంగా ఉన్నదని అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేసిన తర్వాతి రోజే కాంగ్రెస్ నేత ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, పంజాబ్లోనూ కాంగ్రెస్, ఆప్ల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది.
ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుంటే అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) గోవాలో ఏం చేస్తున్నారని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ (shivasena leader sanjay routh) మండిపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో గోవాలో ఇంటింటి ప్రచారం చేయవద్దని సూచించారు. ఆదివారం సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో కేసులు పెరుగుతున్నప్పటికీ ఢిల్లీ సీఎం గోవాలో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారని, ఆయనకు ఏం కావాలని ప్రవ్నించారు. దీనికి అరవింద్ కేజ్రీవాల్ సమాధానం చెప్పాలని అన్నారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ పార్టీ (ఆమ్ ఆద్మీ పార్టీ) అంత బలంగా ఉండే గోవాను ఆయన ఎందుకు సందర్శిస్తారని అన్నారు. కేసులు పెరుగుతున్న సమయంలో ఢిల్లీకి ఆయన అసవరం చాలా ఉందని తెలిపారు.