ఆప్ దూకుడు: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటన.. కాంగ్రెస్ లో టెన్షన్ !
Bhopal: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపింది. అయితే, ఆప్ ప్రకటన తర్వాత కాంగ్రెస్లో టెన్షన్ పెరిగింది.
Madhya Pradesh Election 2023: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మరో కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 230 స్థానాల్లో పోటీ చేయనుందని ప్రకటించింది. అలాగే, ప్రజలు కనెక్ట్ కావడానికి ఫోన్ కాల్ నంబర్ను కూడా ప్రకటించింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగుతామని ప్రకటించిన ఆప్.. తాము అధికారంలోకి వస్తే ఢిల్లీ, పంజాబ్ లలో ఆప్ ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత సౌకర్యాలు, సంక్షేమ పథకాలను సైతం ఇక్కడ కూడా అమలు చేస్తామని హామీలు కురిపించింది.
మధ్యప్రదేశ్ లో ఆప్ అడుగులు..
పంజాబ్-ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్ను మధ్యప్రదేశ్ పై పడింది. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన పార్టీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ-రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్ మాట్లాడుతూ, "కాంట్రాక్ట్ కార్మికుల కన్ఫర్మేషన్ మధ్యప్రదేశ్లో ఆప్ ప్రధాన అంశంగా ఉంటుంది. ఇక్కడ కూడా మేము ఆ సౌకర్యాలను ఉచితంగా అందిస్తాము. ఢిల్లీ-పంజాబ్ లలో మాదిరిగా సంక్షేమ పథకాలు తీసుకువస్తాం" అని తెలిపారు. "రాష్ట్ర ఎన్నికలకు తక్కువ సమయం ఉందని తెలిపిన ఆయన.. ప్రజలు ఎన్నికల్లో పాలు పంచుకుంటారు.. ప్రజలతో కలిసి ముందుకు నడుస్తాం.. ప్రజలు ఎన్నికల్లో పోటీ చేస్తారు" అని అన్నారు.
ఎన్నికల వ్యూహాల గురించి మాట్లాడుతూ..
ప్రజా ప్రభుత్వం.. ప్రజలే నాయకులు.. మధ్యప్రదేశ్లో కూడా అదే వ్యూహంతో ఆమ్ ఆద్మీ పార్టీ అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోందనీ, ఆ కారణంగానే పంజాబ్, ఢిల్లీలో అధికార పీఠాన్ని అధిష్టించిందని తెలిపారు. దాని ఆధారంగానే గుజరాత్ అసెంబ్లీలో అడుగుపెట్టిందని కూడా తెలిపారు. మధ్యప్రదేశ్లోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ప్రజలతో కలిసి ముందుకు సాగుతామని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటనతో కాంగ్రెస్ లో టెన్షన్ పెరిగింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చిన కాంగ్రెస్ శిబిరంలో గుజరాత్ తరహాలో ఆమ్ ఆద్మీ పార్టీ చెలరేగిపోతుందన్న ఆందోళన నెలకొంది.
గుజరాత్ లో కాంగ్రెస్ కు ఆప్ షాక్ !
గతేడాది గుజరాత్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేసింది. ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ 156 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2017తో పోలిస్తే బీజేపీకి ఎక్కువగా 33 సీట్లు వచ్చాయి. ఆమ్ ఆద్మీ 5 సీట్లు గెలుచుకుంది, అయితే అది సాధించిన ఓట్ల శాతం అందరినీ, ముఖ్యంగా కాంగ్రెస్ను ఆశ్చర్యపరిచింది. ఆప్కి 12.9 శాతం ఓట్లు వచ్చాయి. ఇది కాకుండా 35 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ రన్నరప్గా నిలిచింది.
గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్కు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి 16 సీట్లు మాత్రమే వచ్చాయి. గతంలో 2017లో కాంగ్రెస్కు 77 సీట్లు వచ్చాయి. ఫలితాలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేడా మాట్లాడుతూ.. కాంగ్రెస్ స్థానాన్ని ఆప్ ఆక్రమించిందని అన్నారు. ఖేడా ప్రకటనకు గణాంకాలు కూడా సాక్ష్యమిస్తున్నాయి. 2017లో కాంగ్రెస్కు దాదాపు 43 శాతం ఓట్లు రాగా, 2022 నాటికి అది 27 శాతానికి పడిపోయింది. కాంగ్రెస్ ఓట్ల శాతం 16 శాతం తగ్గగా.. ఆప్ కు దాదాపు 13 శాతం ఓట్లు రావడం గమనార్హం. కాంగ్రెస్ ఓట్లు ఆప్కి మారాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మధ్యప్రదేశ్లోనూ గుజరాత్ తరహా పరిస్థితి వస్తుందా?
ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యప్రదేశ్లోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించి కాంగ్రెస్లో టెన్షన్ను పెంచింది. గుజరాత్ తరహాలో మధ్యప్రదేశ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లను చీల్చడంలో విజయం సాధిస్తే.. కాంగ్రెస్కు దారి కష్టమే. ఇది అసెంబ్లీ ఎన్నికలకే కాదు, వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు ఝలక్ ఇవ్వొచ్చు. రాజస్థాన్లో కూడా ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ఆప్ ప్రకటించింది.