Rajasthan HC: బిడ్డను కనేందుకు జీవిత ఖైదు అనుభవిస్తున్న తన భర్తకు పెరోల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించింది ఓ మహిళ. అయితే, దీనికి సంబంధించి పెరోల్ సమయంలో పిల్లలు కనేందుకు స్పష్టమైన నియమాలు లేవని పేర్కొన్న ధర్మాసనం.. మత తత్వశాస్త్రం, భారతీయ సంస్కృతి..వివిధ న్యాయపరమైన అంశాలను పరిగణలోకి తీసుకుని.. వంశాన్ని సంరక్షించే ఉద్దేశ్యంతో పిల్లలను కనడం హక్కుగా పేర్కొని బెయిల్ ఇచ్చింది.
Rajasthan : రాజస్థాన్లో పెరోల్ విషయంలో ఓ విచిత్రం అంశం తెరమీదకు వచ్చింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ వ్యక్తికి రాజస్థాన్ హైకోర్టు తన భార్య బిడ్డను కనాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా పెరోల్ ఇచ్చింది. న్యాయమూర్తులు సందీప్ మెహతా, ఫర్జాంద్ అలీలతో కూడిన డివిజన్ బెంచ్ భిల్వారా జిల్లాకు చెందిన నంద్లాల్కు 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ పెరోల్ కు సంబంధించిన విషయం చర్చనీయాంశంగా మారింది. దీనిపై భిన్నాభిప్రయాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాల్లోకెళ్తే.. జైలులో ఉన్న తన భర్త నుంచి బిడ్డను కనాలని కోరుతూ.. సదరు మహిళ జిల్లా కలెక్టర్ను ఆశ్రయించి పెరోల్ కోరింది. అయితే కలెక్టర్ తన పిటిషన్పై చర్యలు తీసుకోకపోవడంతో భార్య హైకోర్టును ఆశ్రయించింది. సదరు మహిళ వాదనలు విన్న రాజస్థాన్ న్యాయస్థానం మానవతా దృక్పథంతో భర్తకు 15 రోజుల పెరోల్పై వెళ్లాలని ఆదేశించింది. ఇక్కడ గమనించదగ్గ మరో విషయం ఏమిటంటే.. పదకొండు నెలల క్రితం నంద్లాల్కు 20 రోజుల పెరోల్ వచ్చింది. నంద్లాల్కు శిక్ష పడకముందే వివాహమైంది. అతను ఫిబ్రవరి 6, 2019 నుండి అజ్మీర్ జైలులో జీవిత ఖైదును అనుభవిస్తున్నాడు. అతనికి గత ఏడాది మేలో మొదటి పెరోల్ లభించింది. ఇంతలో, కరోనావైరస్ మరియు ఇతర కారణాల వల్ల, నంద్లాల్ అతని భార్య మరియు కుటుంబ సభ్యులతో దాదాపు రెండేళ్లపాటు కలుసుకోవడానికి వీలుకాలేదు.
మొదట ఖైదు భార్య తన దరఖాస్తుతో జైలు అధికారులను మరియు కలెక్టర్ను ఆశ్రయించింది. కొద్దిరోజుల క్రితం ఓ లాయర్తో జైలు అధికారులను ఆశ్రయించిన ఆమె..తాను తల్లిని కావాలనుకుంటున్నట్లు చెప్పింది. తన హక్కు నెరవేరాలంటే తన భర్తను కొద్దిరోజులు పెరోల్పై విడుదల చేయాలని ఆమె వారిని కోరింది. జైలు అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కలెక్టర్ వద్దకు వెళ్లి వినతిపత్రం సమర్పించారు. కలెక్టర్ కూడా సీరియస్గా తీసుకోకుండా పెండింగ్లో ఉంచారు. సమాధానం కోసం ఎదురుచూసి విసిగిపోయిన మహిళ నేరుగా హైకోర్టును ఆశ్రయించింది. తన భర్త అనుకోకుండా నేరం చేశాడని, అతడు వృత్తిరీత్యా నేరస్థుడు కాదని చెప్పింది. తన భర్త జైలు నిబంధనలన్నింటినీ కచ్చితంగా పాటిస్తున్నాడని ఆమె పేర్కొంది. తాను తల్లిని కావాలనుకుంటున్నాననీ, తన భర్తకు పెరోల్ ఇవ్వాలంటూ కోర్టు కోరింది.
అయితే, పెరోల్ సమయంలో పిల్లల పుట్టుకకు స్పష్టమైన నియమాలు లేవని డివిజన్ బెంచ్ గుర్తించింది. కానీ.. మత తత్వశాస్త్రం, భారతీయ సంస్కృతి మరియు వివిధ న్యాయపరమైన అంశాలను పరిగణలోకి తీసుకుని.. వంశాన్ని సంరక్షించే ఉద్దేశ్యంతో పిల్లలను కనడం హక్కుగా గుర్తించింది. ఈ కేసుపై విచారణ జరిపిన ధర్మాసనం.. ఋగ్వేదం, వేద శ్లోకాలను ఉదాహరణగా పేర్కొంటూ.. పిల్లల పుట్టుకను ప్రాథమిక హక్కు అని కూడా పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. పెళ్లయినప్పటి నుంచి ఇప్పటి వరకు దంపతులకు ఎలాంటి సమస్యలు లేవని తీర్పు చెప్పింది. హిందూ తత్వశాస్త్రం ప్రకారం, భావన 16 మతకర్మలలో అగ్రస్థానంలో ఉందని పేర్కొంటూ.. సదరు ఖైదీకి పెరోల్ ఇచ్చింది.
