‘జై శ్రీరాం’ అనలేదని 10 ఏళ్ల ముస్లిం బాలుడిని చితకబాదిన గిరిజనుడు.. మధ్యప్రదేశ్ లో ఘటన
‘జై శ్రీరాం’ అనే నినాదం చేయనందుకు పదేళ్ల ముస్లిం బాలుడిని ఓ గిరిజన యువకుడు దారుణంగా కొట్టాడు. దీంతో బాధితుడు తన తల్లిదండ్రులకు దాడి విషయం చెప్పాడు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
మధ్యప్రదేశ్ లో దారుణం వెలుగులోకి వచ్చింది. జై శ్రీరాం అనలేదని ఓ పదేళ్ల ముస్లిం బాలుడిని గిరిజన యువకుడు చితకబాదాడు. దీంతో బాలుడికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
మతపరంగా సున్నితమైన ఖాండ్వా జిల్లాలో ఈ ఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఖండ్వా జిల్లాలోని పంధానా ప్రాంతంలో పదేళ్ల ముస్లిం బాలుడు ఐదో తరగతి చదువుతున్నాడు. అయితే ఆ బాలుడు ప్రైవేట్ గా ట్యూషన్ కు కూడా వెళ్లేవాడు. అయితే గురువారం సాయంత్రం ఎప్పటిలాగే ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో ట్యూషన్ కోసం వెళ్తున్నాడు.
ఈ సమయంలో అజయ్ భిల్ అనే గిరిజనుడు బాలుడిని ఆపాడు. జై శ్రీ రామ్ అని నినాదాలు చేయాలని ఒత్తిడి తెచ్చాడు. అయితే బాలుడు ముస్లిం కమ్యూనిటీకి చెందినవాడు కావడంతో హిందూ మతపరమైన నినాదాన్ని పలికేందుకు నిరాకరించాడు. దీంతో కోపోద్రిక్తుడైన నిందితుడు అజయ్ భిల్ బాలుడిని అక్కడి నుంచి బయటకు వెళ్లనివ్వకుండా నినాదాలు చేసే వరకు కొట్టాడు. దీంతో బాలుడికి గాయలు అయ్యాయి. భయపడుతూనే ఇంటికి వెళ్లిన బాలుడు తనపై జరిగిన దాడిని తల్లిదండ్రులకు వివరించాడు.
ఈ ఘటనపై బాలుడి తండ్రి పంధాన పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. నిందితుడు అజయ్పై ఐపీసీ సెక్షన్ 295ఏ (మత భావాలను అవమానించడం), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం) కింద బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఖాండ్వా పోలీస్ స్టేషన్ డిప్యూటీ ఎస్పీ అనిల్ సింగ్ చౌహాన్ తెలిపారు.
ఇలాంటి ఘటనే సెప్టెంబర్ లో హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఓ ముస్లిం క్యాబ్ డ్రైవర్ ‘జై శ్రీరాం’ అని పలకనందుకు పలువురు వ్యక్తులు అతడిపై దాడి చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. సయ్యద్ లతీఫుద్దీన్ అనే వ్యక్తి ఉబర్ కార్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అయితే సెప్టెంబర్ 4వ తేదీన అల్కాపురిలో రైడ్ రావడంతో అక్కడి వెళ్తున్నాడు. అయితే టోలిచౌకి సమీపంలోకి చేరుకునే సరికి 3.45 గంటల ప్రాంతంలో రెండు బైక్లు కారుపక్కన వచ్చి ఆగాయి. వాటిపై నుంచి నలుగురు వ్యక్తులు దిగి మొదట కారును చేతులతో కొట్టారు. ఏమైందని డ్రైవర్ వారిని అడిగాడు. అతడి యాసను గమనించిన వ్యక్తులు జై శ్రీరాం అని నినాదాలు చేయాలని అన్నారు. అతడు దానికి ఒప్పుకోలేదు.
నిందితులు కారు డోరు తీసేందుకు ప్రయత్నించారు. కానీ వారి నుంచి బాధితుడు తప్పించుకొని అల్కాపురి సమీపంలోని ఏకాంత ప్రదేశానికి చేరుకున్నాడు. దాదాపు మూడు కిలో మీటర్లు ఆ బైక్ లపై వారు కూడా అతడిని వెంబడించారు. కానీ ఓ చోట డెడ్ ఎండ్ ఉండటంతో లతీఫుద్దీన్ ఆగిపోయాడు. వెంటనే అతడు ఫోన్ ద్వారా, బయట గట్టిగా అరుస్తూ సాయం కావాలని కోరడం ప్రారంభించాడు. అయినా ఎవరూ లేకపోవడం, నిందితులు దగ్గరికి వస్తుండటంతో బయపడిపోయిన డ్రైవర్ సమీపంలోని పొదల్లో దాక్కున్నాడు. దీంతో చుట్టుపక్కల ఉన్న భారీ రాళ్లను ఎత్తుకెళ్లి సైడ్ విండోలను పగలగొట్టారు. ఇదే సమయంలో స్థానికులు అటుగా రావడంతో కారు పేపర్లను, నగదును తీసుకెళ్లిపోయారు. అనంతరం బాధితుడు పోలీసులకు సమాచారం అందించాడు.