అంతిమ సంస్కారాల నిర్వహణకు స్టార్టప్.. నోరెళ్లబెడుతున్న నెటిజన్లు.. పోస్టు వైరల్
అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి ఓ స్టార్టప్ వెలిసింది. ఢిల్లీలో నిర్వహిస్తున్న ఓ ట్రేడ్ ఫేర్లో అంతిమ సంస్కారాల నిర్వహణ సంస్థ సుఖాంత్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ స్టాల్ ఒకటి ఉన్నది. ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
న్యూఢిల్లీ: స్టార్టప్ల హవా కొన్ని సంవత్సరాలుగా పెరిగింది. మనం ఊహించని పనులను, సేవలను సులభం చేస్తూ అనేక స్టార్టప్లు వెలిశాయి. అందులో చాలా వరకు సక్సెస్ అయ్యాయి కూడా. కానీ, ఐఏఎస్ అవనీశ్ శరణ్ ట్విట్టర్లో పోస్టు చేసిన స్టార్టప్ మాత్రం ఎవరూ ఊహించనిది. అసలు ఊహకే అందని షాకింగ్ ఐడియా. అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి ఒక స్టార్టప్ ఢిల్లీలో నిర్వహించిన ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్లో దర్శనం ఇచ్చింది. సుఖాంత్ ఫునెరల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో ఆ ట్రేడ్ ఫేర్లో స్టాల్ ఉన్నది.
ఢిల్లీ ట్రేడ్ ఫేరర్లో ఆ స్టాల్ ఉన్నట్టు అవనీశ్ శరణ్ పోస్టు చేసిన ఫొటోలో కనిపిస్తున్నది. ఈ స్టార్టప్ ఫొటో చూడగానే చాలా మంది ఖంగుతింటున్నారు. సంస్కారాలు నిర్వహించడానికి కూడా స్టార్టప్ ఉంటుందా? దాన్ని ఎవరు వినియోగిస్తారు? అసలు ఈ ఆలోచనే ఎందుకు వచ్చింది? అని అనేక విధాల నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తమ ప్రియతముల చివరి చూపు కోసం ఆప్తులు, అభిమానులు పరితపిస్తారు. వారితో కడసారి నడిచి అంత్యక్రియలు చేసి బరువైన గుండెతో తిరిగి వస్తారు. ఎన్నటికైనా ఆ దృశ్యాలు వారి మనసు ఫలకంపై శాశ్వతంగా ఉండిపోతాయి. అలాంటిది.. అంతిమ సంస్కారాలు నిర్వహించడానికీ ఒక స్టార్టప్ పెట్టడం ఏంటని చాలా మంది ప్రశ్నలు గుప్పతిస్తున్నారు.
Also Read: తండ్రి ప్రేమ... కూతురి కోసం రూ.లక్షల జీతం వచ్చే ఉద్యోగం వదిలేసి...!
ఆ స్టార్టప్ వెబ్ సైట్ ప్రకారం, గౌరవంగా, హుందాగా కడసారి వీడ్కోలు అందించాలనే లక్ష్యంతో సుఖాంత్ ఫునెరల్ అనే ఆర్గనైజనేషన్ను ప్రారంభించినట్టు ఉన్నది. అంతిమ సంస్కారాలను గౌరవంగా ప్లాన్ చేయడంతో తాము ఎంతో నైపుణ్యం కలవారమని వివరించింది. ఫునెరల్ సొల్యూషన్్ కోసం కూడా మూడు రకాల స్కీములను ఆ వెబ్ సైట్లో పొందుపరచడం మరో చమత్కారం.