Bengaluru: దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా దేశ పౌరులు వారివారి ఇండ్లపై జాతీయ జెండాలను ఎగురవేస్తున్నారు.
karnataka: దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా దేశ పౌరులు వారివారి ఇండ్లపై జాతీయ జెండాలను ఎగురవేస్తున్నారు. ఈ క్రమంలోనే కర్నాటకలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ఓ టెకీ టెర్రస్ పై జాతీయ జెండా స్తంభానికి కట్టడానికి వెళ్లాడు. అయితే, ప్రమాదవశాత్తు జారిపడి ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకెళ్తే.. 33 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ తాను నివసిస్తున్న భవనంలోని రెండో అంతస్తులో జాతీయ జెండాను ఎగురవేస్తూ కిందపడి మృతిచెందిన ఘటన ఆదివారం హెన్నూరులో చోటుచేసుకుంది. దక్షిణ కన్నడలోని సుల్లియాకు చెందిన నారాయణ్ భట్ బెంగళూరులోని ఒక ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతని ఏకైక కుమారుడు విశ్వాస్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు హెన్నూరులోని హెచ్బిఆర్ లేఅవుట్లోని వి బ్లాక్లోని తన భవనంలోని టెర్రస్పైకి వెళ్లాడు. ప్రమాదవశాత్తు జెండాను అక్కడ కడుతుండగా, కిందపడిపోయాడు. దీంతో తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. రెండు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో విశ్వాస్ నివాసముంటున్నారు. విశ్వాస్ కుమార్ తన భార్య వైశాలి, వారి రెండేళ్ల కుమార్తె, అతని తల్లిదండ్రులతో కలిసి గ్రౌండ్ ఫ్లోర్లో నివాసముంటున్నారు.
ఆదివారం మధ్యాహ్నం 1.45 గంటల ప్రాంతంలో విశ్వాస్ జెండాను స్తంభానికి కట్టేందుకు టెర్రస్ గోడపైకి ఎక్కి ప్రమాదవశాత్తు జారి కింద పడిపోయాడు. "నారాయణ్ భట్, వైశాలి అతనిని సాగర్ అపోలో ఆసుపత్రికి తరలించారు . అయితే, అతను సాయంత్రం 5 గంటలకు తలకు తీవ్ర గాయాలు కావడంతో ప్రాణాలు కోల్పోయాడు" అని హెన్నూర్ పోలీసులు తెలిపారు. జాతీయ జెండాలు ఇంటిపై పెట్టే సందర్భంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తన ఇంటిపై జాతీయ జెండా కడుతూ ప్రాణాలు కోల్పోయిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ వ్యక్తి తన ఇంటి పై కప్పుపై జాతీయ జెండా కడుతుండగా కరెంట్ తీగలు తాకడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ వీడియో నెట్టిట్ట వైరల్ గా మారింది. ఎక్కడ జరిగింది అనే విషయంపై స్పష్టంత లేదు. దీనిని షేర్ చేస్తున్న .నెటిజన్లు.. ఇంటిపై జాతీయ జెండా కట్టే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
