రాజస్థాన్లో పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. పలువురికి గాయాలు
Pali: సోమవారం తెల్లవారుజామున రాజస్థాన్లోని పాలిలో సూర్యనగరి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో దాదాపు 10కి పైగా మంది ప్రయాణికులు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Suryanagari Express train: రాజస్థాన్ లో ఒక ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను అధికారులు సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్న అధికారులు.. ఈ ప్రమాదంలో గాయపడ్డవారికి ప్రభుత్వం లక్ష రూపాయల పరిహారం ప్రకటించింది.
వివరాల్లోకెళ్తే.. రాజస్థాన్లో సోమవారం తెల్లవారుజామున రైలు పట్టాలు తప్పడంతో దాదాపు 10 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. పాలీలోని రాజ్కియావాస్లో తెల్లవారుజామున 3:27 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. జోధ్పూర్ డివిజన్లోని రాజ్కియావాస్-బొమద్ర సెక్షన్ మధ్య సూర్యనగరి ఎక్స్ప్రెస్ ఎనిమిది కోచ్లు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. బాంద్రా టెర్మినస్ నుంచి బయలుదేరిన ఈ రైలు జోధ్పూర్కు వెళుతోంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
నార్త్ వెస్ట్రన్ రైల్వే ఉన్నతాధికారులు జైపూర్లోని ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ రూమ్లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. త్వరలో ప్రమాద స్థలానికి చేరుకుంటారని CPRO, నార్త్ వెస్ట్రన్ రైల్వే తెలిపారు. కాగా, రాజస్థాన్లో రైలు పట్టాలు తప్పిన ఘటనతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
హెల్ప్లైన్ నంబర్లు:
ప్రమాదం నేపథ్యంలో రైల్వే శాఖ కొన్ని హెల్ప్లైన్ నంబర్లను విడుదల చేసింది. ప్రయాణీకుల గురించి తెలుసుకోవాలనుకునే వారు క్రింద పేర్కొన్న నంబర్లను సంప్రదించాలి.
జోధ్పూర్:
0291- 2654979(1072)
0291- 2654993(1072)
0291- 2624125
0291- 2431646
పాలి మార్వార్:
0293- 2250324
138
1072
మార్వార్ జంక్షన్ నుంచి బయలుదేరిన ఐదు నిమిషాల్లోనే రైలు లోపల కంపనం లాంటి శబ్దం వినిపించిందని ఓ ప్రయాణికుడు వార్తా సంస్థ ఏఎన్ఐ మాట్లాడుతూ చెప్పారు. "మార్వార్ జంక్షన్ నుండి బయలుదేరిన 5 నిమిషాల్లో, రైలు లోపల వైబ్రేషన్ సౌండ్ వినిపించింది. 2-3 నిమిషాల తర్వాత రైలు ఆగిపోయింది. మేము దిగి, కనీసం 8 స్లీపర్ క్లాస్ కోచ్లు ట్రాక్ల నుండి బయటికి రావడం చూశాము. 15-20 నిమిషాలలో , అంబులెన్స్లు వచ్చాయి" అని చెప్పాడు.