పబ్లో ఇద్దరు మహిళల వీరంగం.. ఓ వ్యక్తిపై దాడి.. వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్లోని ఓ పబ్లో ఇద్దరు మహిళలు వీరంగం చేశారు. ఓ పురుషుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. పూల కుండీతో మరీ దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఓ వ్యక్తిని ఇద్దరు మహిళలు దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. లక్నో కొన్నాళ్లుగా హాట్ టాపిక్గా ఉంటూ వస్తున్నది. లులు మాల్లో రాత్రిపూట షాపింగ్, రాత్రిళ్లు ప్రేయర్స్ చేస్తున్న వైరల్ వీడియోలు, మరికొన్ని వివాదాలతో లక్నో నగరం ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలిచింది. తాజాగా, మరో ఘటనతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
ఈ సారి వివాదానికి కేంద్రంగా లక్నోలోని ఓ పబ్ నిలిచింది. విభూతిఖంద్ పోలీసు స్టేషన్ ఏరియాలోకి వచ్చే అన్ప్లగ్డ్ కేఫ్లోకి పలువురు ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు. సరిగ్గా ఎంట్రీలోనే ఇద్దరు మహిళలు ఓ పురుషుడిపై విచక్షణారహిత దాడికి పాల్పడ్డారు.
ఇద్దరు మహిళలు ఓ పురుషుడి పై దాడి చేశారు. ఆ పురుషుడు వారికి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ, వారు వినిపించుకునే దశలో లేరు. అందులో ఒక మహిళ అక్కడే డెకరేషన్లో భాగంగా ఉంచి ఫ్లవర్ పాట్ను చేతిలోకి తీసుకుంది. ఆ పూల కుండితో ఆ వ్యక్తిపై భుజంపై కొట్టింది. ఆ కుండి పగిలిపోయే వరకు దాడి చేసింది. పరిస్థితులు చేయి దాటిపోయేలా ఉన్నాయని తలచి అక్కడే ఉన్న ఓ బాక్సర్ వెంటనే కలుగజేసుకున్నాడు. ఆ మహిళలను, పురుషులను బౌన్సర్ విడదీశాడు. ఆ పురుషుడిని బయటకు పంపించాడు.
ఈ ఘటనను వీడియో తీశారు కొందరు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ ఘటనకు సంబంధించి ఇది వరకు ఎవరూ అరెస్టు కాలేదు. తమకు ఎటు వైపు నుంచీ ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు. ఒక వేళ ఫిర్యాదు అందితే ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేస్తామని పేర్కొన్నారు.