యూపీలోని కాన్పూర్ లో చెలరేగిన హింసాకాండకు కారణమైన 1,500 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే 36 మందిని అరెస్టు చేశారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఎవరినీ వదిలిపెట్టబోమని పోలీసులు తెలిపారు.
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో శుక్రవారం చెలరేగిన హింసాకాండ ఘటనలో ఇప్పటి వరకు కీలక నిందితులతో సహా 36 మందిని అరెస్టు చేశారు. 1,500 మందికి పైగా కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని యూపీ పోలీసులు శనివారం వెల్లడించారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిని జాఫర్ హయత్గా పోలీసులు గుర్తించారు. అతడే పోస్టర్లు, సోషల్ మీడియా పోస్ట్ల ద్వారా బంద్ కు పిలుపునిచ్చాడు. ఊరేగింపు కూడా చేపట్టాలని సూచించాడు. దీంతో హింస చెలరేగింది.
40 మందికి పైగా గాయపడిన ఈ హింసాకాండలో పాల్గొన్న వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు వీడియో క్లిప్లను పరిశీలించిన అనంతరం ఈ అరెస్టులు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులపై ఈ కేసులో మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీడియోల ఫుటేజ్ ల ఆధారంగా మరింత మంది వ్యక్తులను గుర్తిస్తున్నట్లు పోలీసు కమిషనర్ విజయ్ సింగ్ మీనా తెలిపారు. కుట్రదారులపై గ్యాంగ్స్టర్ చట్టం కింద చర్యలు తీసుకుంటామని, వారి ఆస్తులను సీజ్ చేస్తామని చెప్పారు. కాన్పూర్ లో శాంతి భద్రతల పరిరక్షణకు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా నగరంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
కాశ్మీరీ పండిట్లకు మహారాష్ట్ర అండగా ఉంటుంది - సీఎం ఉద్ధవ్ ఠాక్రే
ఇటీవల జ్ఞాన్ వ్యాపి మసీదుపై మీడియాతో చర్చ సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికార ప్రతినిధి నూపుర్ శర్మ మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేశారు. దీనిని నిరసిస్తూ మార్కెట్లను మూసివేయాలని ఓ వర్గం సభ్యులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఓ గ్రూపుపై మరో గ్రూపు రాళ్లు రువ్వుకుంది. దీంతో శుక్రవారం ప్రార్థనల అనంతరం కాన్పూర్లోని కొన్ని ప్రాంతాల్లో హింస చెలరేగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆయా ప్రాంతాల్లోకి చేరుకున్నారు. నిందితులను చెదరగొట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో టియర్ గ్యాస్ కూడా ప్రయోగించాల్సి వచ్చింది.
ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన 13 మంది పోలీసులు, మరో ముప్పై మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ‘‘ 50-100 మంది యువకులు అకస్మాత్తుగా వీధుల్లోకి వచ్చి నినాదాలు చేయడం ప్రారంభించారు. మరో వర్గం దానిని వ్యతిరేకించడంతో అది రాళ్లదాడికి దారితీసింది. దాదాపు ఎనిమిది నుండి పది మంది పోలీసులు సంఘటనా స్థలంలో ఉన్నారు, వారు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించారు. పరిస్థితిని నియంత్రించారు. ఈ క్రమంలోనే పోలీసు కంట్రోల్ రూమ్కు వెంటనే సమాచారం అందించారు. దీంతో నాతో సహా సీనియర్ అధికారులు 10 నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకున్నారు ’’ అని పోలీసు అధికారి మీనా శుక్రవారం తెలిపారు.
Agnipath : ‘అగ్నిపథ్’ స్కీమ్ ను ప్రధానికి వివరించిన సైనికాధికారులు.. ఇంతకీ ఆ స్కీమ్ ఏంటంటే ?
ఈ హింసాకాండ చోటు చేసుకున్నకాన్పూర్ కు అదే సమయంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వచ్చేశారు. వారు ఆ ప్రాంతంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఆ కార్యక్రమ స్థలానికి కొద్ది దూరంలోనే ఇది చోటు చేసుకోవడం గమనార్హం. దీనిపై యూపీ ప్రతిపక్ష నాయకుడు, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. బీజేపీ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యల వల్ల కాన్పూర్ లో హింస చెలరేగిందని ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు.
