మనసున్న బిచ్చగాడు..అడుక్కొన్న సొమ్ము కేరళ బాధితులకు అందజేత
భారీ వర్షాలు, వరదలతో సర్వస్వాన్ని కోల్పోయిన కేరళను ఆదుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులు, కార్పోరేట్ సంస్థలు ముందుకొస్తున్నాయి. వారందరి చేయూత కారణంగా ఇప్పటి వరకు రూ.1000 కోట్ల పైనే విరాళాలు అందాయి
భారీ వర్షాలు, వరదలతో సర్వస్వాన్ని కోల్పోయిన కేరళను ఆదుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులు, కార్పోరేట్ సంస్థలు ముందుకొస్తున్నాయి. వారందరి చేయూత కారణంగా ఇప్పటి వరకు రూ.1000 కోట్ల పైనే విరాళాలు అందాయి. అయితే తాను కూడా కేరళకు సాయం చేయాలని భావించిన ఓ బిచ్చగాడు ఎర్రట్టుపట్ట మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్ టీఎం రషీద్ ఇంటికి వెళ్లాడు.
బిచ్చగాడు కావడంతో రషీద్ ఓ రూ.20 నోటును తీసి అతనికి ఇచ్చే ప్రయత్నం చేశాడు. దానిని పక్కకునెట్టిన యాచకుడు.. తన దగ్గరున్న చిల్లరనంతా లెక్కపెట్టి.. రూ.94ను రషీద్ అందించి.. తన వంతుగా దీనిని కేరళ వరద బాధితులకు అందజేయాల్సిందిగా కోరాడు.
యాచకుడి మంచిమనసును అర్ధం చేసుకున్న రషీద్ వెంటనే ఆ రూ.94ను కేరళ సీఎం సహాయనిధికి పంపాడు. ఈ విషయాన్ని రషీద్ తన సోషల్ మీడియాలో ప్రకటించాడు. కేవలం రషీద్ను కలవడానికే సుమారు 4 కిలోమీటర్లు నడుచుకుంటూ ఎర్రట్టుపట్టు చేరుకున్నాడు. దీంతో నెటిజన్లు యాచకుడిని మెచ్చుకుంటున్నారు.