కిరాణా షాప్ కు వెళ్లివస్తుండగా వీధికుక్కల దాడి.. ఐదేండ్ల బాలిక మృతి
stray dogs attacked: మధ్యప్రదేశ్ లో ఐదేండ్ల బాలికపై వీధికుక్కల గుంపు దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలిక ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.
Madhya Pradesh: కిరాణా షాప్ దగ్గరకు వెళ్లి వస్తున్న ఐదేండ్ల బాలికపై అక్కడే ఉన్న వీధికుక్కల గుంపు దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలిక ప్రాణాలు కోల్పోయింది. మధ్యప్రదేశ్ లో చోటుచేసుకున్న ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు నెలకొన్నాయి. వివరాల్లోకెళ్తే.. ఖర్గోన్ జిల్లాలో శుక్రవారం ఐదేళ్ల బాలికపై వీధికుక్కలు దాడి చేశాయి. సోనియా అనే బాలిక మెడకు, ఇతర శరీర భాగాలకు తీవ్రగాయాలై తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే, బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఈ ఘటన బేడియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బకావా గ్రామంలో చోటుచేసుకుంది. బాలిక శుక్రవారం మధ్యాహ్నం సమీపంలోని దుకాణంలో కిరాణా సామాను కొనడానికి వెళుతుండగా వీధిలో అర డజనుకు పైగా కుక్కలు దాడి చేశాయి. కూలి పని చేసే ఆమె తండ్రి ఏదో పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో కూతురిపై కుక్కలు దాడి చేశాయి. బాలిక కేకలు విన్న స్థానికులు ఆమెకు సహాయం చేయడానికి పరుగెత్తారు. అక్కడి నుంచి కుక్కలను తరిమికొట్టారు. అయితే, అప్పటికే కుక్కల గుంపు బాలికపై తీవ్రంగా దాడి చేసి.. కరిచాయి. చిన్నారి మెడ, సహా ఇతర శరీర భాగాలను తీవ్రంగా గాయపర్చాయి.
తీవ్రంగా గాయపడ్డ బాలికను వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. బాలికను బేడియాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో ఆ తర్వాత జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే, తీవ్ర గాయాలు, రక్తస్రావం అధికంగా కావడంతో బాలిక ప్రాణాలు కోల్పోయిందని ఆస్పత్రి సివిల్ సర్జన్ అనర్ సింగ్ చౌహాన్ వెల్లడించారు.
ఏడాది జనవరి, ఏప్రిల్ లోనూ ఇలాంటి ఘటనలు..
మధ్యప్రదేశ్ లో ఈ ఏడాది జనవరి కూడా చిన్నారులపై కుక్కలు దాడి చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. మధ్యప్రదేశ్లోని భోపాల్లో జనవరి 3న మధ్యాహ్నం నాలుగు సంవత్సరాల బాలికపై వీధికుక్కల గుంపు దాడి చేశాయి. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డవ్వగా, ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంజలి విహార్ కాలనీలో బాలిక తన ఇంటి దగ్గర ఆడుకుంటుండగా ఈ సంఘటన జరిగిందని వార్తా సంస్థ ఏఎన్ఐ నివేదించింది. బాలికను ఓ వ్యక్తి రక్షించగా తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరింది. ఆమె తల, చెవులు, చేతులపై లోతైన గాయాలు ఉన్నాయి. ఐసీయూలో చికిత్స అందించారు.
రాజస్థానల్ లోనూ..
రాజస్థాన్లోని టోంక్లోని నివై సబ్డివిజన్లో ఏప్రిల్ 12న ఉదయం మలవిసర్జన చేయడానికి బయటకు వెళ్లిన 11 ఏళ్ల బాలికపై వీధికుక్కలు దాడి చేసి చంపాయి. అనీషా అనే బాలిక ఉదయం 6 గంటల ప్రాంతంలో మలవిసర్జన చేసేందుకు సమీపంలోని అడవికి వెళ్లిన సమయంలో ఆమెపై కుక్కలు దాడి చేసి చంపాయి. దాదాపు గంటపాటు ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అడవిలో వెతకడానికి బయలుదేరారు. అక్కడకు వెళ్లి చూడగా.. బాలికపై ఆరు కుక్కలు దాడి చేస్తూ కనిపించాయి. అప్పటికే బాలిక చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు.