Birbhum Road Accident: బెంగాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది దుర్మరణం..
Birbhum Road Accident: పశ్చిమ బెంగాల్లో బీర్భమ్ జిల్లా మల్లర్పుర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ సంతాపం తెలిపారు.
Birbhum Road Accident: పశ్చిమ బెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీర్భూమ్ జిల్లాలో మంగళవారం బస్సు, ఆటోరిక్షా ఢీకొన్న ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారి-60 (NH 60)లో ఆటోరిక్షా, బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. రామ్పుర్హట్ నుంచి మల్లర్పుర్ వెళ్తున్న ఆటో.. 60వ నంబరు జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న బస్సును వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 8 మంది మహిళా కూలీలతో సహా ఆటో డ్రైవర్ మరణించారు. వీరంతా తన పని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ఘటన గురించి బీర్భూమ్ జిల్లా ఎస్పీ నాగేంద్ర నాథ్ త్రిపాఠి మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోరిక్షా లో ఎనిమిది మంది మహిళలు ప్రయాణిస్తున్నారని, ఆటో రిక్షా వేగంగా వెళ్తుండటంతో అదుపు తప్పి.. దక్షిణ బెంగాల్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎస్బిఎస్టిసి) బస్సును ఢీకొట్టిందని తెలిపారు. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారని తెలిపారు. వారి మృతదేహాలను ఆరంబాగ్ ఆసుపత్రికి తరలించామని, అక్కడ పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు.
ప్రధాని మోదీ సంతాపం..
ప్రమాదంపై ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సాయం ప్రకటించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల ఎక్స్గేషియా ప్రకటించారు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున అందిచనున్నారు.