బోరుబావిలో చిన్నారి.. 400 అడుగుల లోతు బావిలో పడ్డ 8 యేళ్ల బాలుడు...
బోరుబావిలో ఓ చిన్నారి ఇరుక్కుపోయాడు. 400 అడుగుల బోరుబావిలో 60 అడుగుల లోతులో ఆ చిన్నారి ఇరుక్కుపోయాడు.
మధ్యప్రదేశ్ : నిర్లక్ష్యం చిన్నారుల పాలిట శాపంగా మారుతున్న ఘటనలు ఎన్నో కనిపిస్తున్నాయి. అలాంటి ఘటనల్లో బోరుబావుల్లో చిన్నారులు పడే ఘటనలు అధికమే. బోరుబావిలో పడిన చిన్నారులు దాదాపుగా ప్రాణాలతో బయటపడడం తక్కువగానే జరుగుతుంది. వీటి గురించి తెలిసినా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించి, బోరుబావిని మూయకపోవడంతో ఎన్నోచోట్ల ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మద్యప్రదేశ్ లో ఓ పొలం యజమాని నిర్లక్ష్యం వల్ల ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలు అపాయంలో పడ్డాయి.
మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలోని ఓ గ్రామంలో మంగళవారం ఎనిమిదేళ్ల బాలుడు 400 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయాడు. బాలుడు పొలంలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. మాండవి గ్రామంలో సాయంత్రం 5 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది.
తన్మయ్ దియావర్ అనే బాలుడు మైదానంలో ఆడుకుంటుండగా బావిలో పడిపోయాడు. పొలంలో ఇటీవలే బోరుబావి తవ్వారు. దాన్ని మూయలేదు. దీతో బాలుడు అందులో పడిపోయాడని అత్నర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అనిల్ సోని తెలిపారు. తమకు సమాచారం అందింన వెంటనే అక్కడిక చేరుకున్నామని.. సహాయక చర్యలు ప్రారంభించామని, మట్టి తవ్వే యంత్రాలను తెప్పించామని, బాలుడికి ఆక్సిజన్ అందించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. చిన్నారి బోరుబావిలో దాదాపు 60 అడుగుల లోతులోఇరుక్కుపోయాడని అధికారులు తెలిపారు.