భారత్ లో 40లక్షలకు చేరువలో కరోనా కేసులు
భారత్లో గడచిన 24 గంటల్లో 83,341 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో.. భారత్లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39 లక్షలు దాటింది.
భారత్ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతోందే తప్ప.. తరగడం లేదు. తొలుత కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న స్పెయిన్, అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలలో కరోనా ప్రభావం రానురాను తగ్గిపోతోంది. కానీ భారత్లో మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. భారత్లో గడచిన 24 గంటల్లో 83,341 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో.. భారత్లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39 లక్షలు దాటింది. మరో రెండు రోజుల్లో 40 లక్షలకు చేరువయ్యేలా ఉంది.
ఇప్పటివరకూ మొత్తం 39,36,748 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 8,31,124. భారత్లో కరోనా బారిన పడినవారిలో 30,37,152 మంది ఇప్పటివరకూ కోలుకున్నట్లు భారత వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా మరణాల సంఖ్య 68,472కు చేరడం గమనార్హం.
తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వైరస్ ప్రభావం రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి రోజూ దాదాపు పది వేల కేసులు నమోదౌతున్నాయి. ఇక ఏపీతో పోలిస్తే.. తెలంగాణలో కాస్త పర్వాలేదనిపిస్తోంది. తెలంగాణలో ఇప్పటి వరకు లక్షా 35వేల కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం గమనార్హం.