బంగాళదుంపల కోల్డ్ స్టోరేజీ పైకప్పు కూలి 8 మంది మృతి, 11మంది రెస్క్యూ.. శిథిలాల కింద మరికొంత మంది...
ఆలుగడ్డల కోల్డ్ స్టోరేజ్ పై కప్పు కూలి ఎనిమిదిమంది చనిపోయిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో యజమానులిద్దరిపై కేసు నమోదయ్యింది.
ఉత్తరప్రదేశ్ : యుపిలోని సంభాల్లోని చందౌసి ప్రాంతంలో బంగాళదుంప కోల్డ్ స్టోరేజీ పైకప్పు కూలిపోవడంతో మొత్తం ఎనిమిది మంది మృతి చెందగా, ఇప్పటివరకు 11 మందిని రక్షించారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డిఆర్ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డిఆర్ఎఫ్) బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి.
ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందినట్లు మొరాదాబాద్ డీఐజీ శలభ్ మాథుర్ తెలిపారు. "మొత్తం ఎనిమిది మంది మరణించారు. 11 మందిని రక్షించారు. మరికొంత మంది తప్పిపోయారు. ఈ కోల్డ్ స్టోరేజ్ భవనం బేస్ మెంట్ లో ఉంది. అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాం" అని అతను చెప్పాడు.
జోధా అక్బర్ నటుడు అమన్ ధలివాల్ పై అమెరికాలో కత్తితో దాడి.. నీళ్లు కావాలంటూ వీరంగం...
శిథిలాలలో చిక్కుకున్న వారి కోసం అధికారులు స్నిఫర్ డాగ్లను ఉపయోగిస్తున్నారని సంభాల్ డీఎం మనీష్ బన్సాల్ తెలిపారు. ఎన్డిఆర్ఎఫ్ స్నిఫర్ డాగ్ల సహాయంతో చిక్కుకున్న వ్యక్తుల కోసం వెతుకుతోంది. ఉదయానికి బలగాల సంఖ్య పెంచామని తెలిపారు. ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ ఇతర బృందాలు కూడా వస్తాయని ఆయన చెప్పారు. యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) సంభాల్, చక్రేష్ మిశ్రా తెలిపారు.
"యజమానితో పాటు మరో ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించాం. ప్రధాన నిందితులు కనిపించకుండా పోయారు, సోదాలు చేస్తున్నారు. శిథిలాలు తొలగించిన తర్వాతే భవనం కూలిపోవడానికి అసలు కారణం చెప్పగలం" అన్నారు. ఈ ఘటన గురువారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే గోడౌన్ శిథిలావస్థకు చేరుకుందని గతంలో వార్తలు కూడా వచ్చాయి.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, యజమానులను అంకుర్ అగర్వాల్, రోహిత్ అగర్వాల్గా గుర్తించారు. ఇద్దరు యజమానులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు మొరాదాబాద్ డీఐజీ శలభ్ మాథుర్ తెలిపారు. "ఈ విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. ఇద్దరు నిందితులపై సెక్షన్ 304 కింద కేసు నమోదు చేయబడింది" అని ఆయన చెప్పారు. ఇంకా మాట్లాడుతూ, "ఈ విషయంలో ఏడిఎం స్థాయి విచారణ కూడా జరిగింది. కూలిపోయిన కోల్డ్ స్టోరేజీ కొంత కాలం క్రితమే నిర్మించబడింది. కానీ, నిర్దేశించిన ప్రమాణాలను అనుసరించి నిర్మించలేదు" అన్నారు.