ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఫతేగంజ్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున అంబులెన్స్..ట్రక్కును ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతిచెందారు. వీరిలో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందినవారిగా తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఫతేగంజ్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున అంబులెన్స్..ట్రక్కును ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతిచెందారు. వీరిలో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందినవారిగా తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
పిల్భిత్కు చెందిన ఒక కుటుంబంలోని ఆరుగురు సభ్యులు అంబులెన్స్లో ఢిల్లీ నుంచి తిరిగివస్తున్నారు. వారిలో ఒకరికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చూపించి తిరిగివస్తుండగా.. ఢిల్లీ-లక్నో హై వేపై ప్రమాదం చోటుచేసుకుంది. అంబులెన్స్ మొదట డివైడర్ను ఢీకొట్టి.. తర్వాత ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్తో పాటు వాహనంలోని మరో ఆరుగురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు.
‘‘అంబులెన్స్లో మొత్తం ఏడుగురు మృతిచెందారు. వారిలో డ్రైవర్ కూడా ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించాం’’ అని బరేలీ ఎస్ఎస్పీ Rohit Singh Sajwan తెలిపారు. ఇక, ఈ ప్రమాదంపై విచారణ కొనసాగుతోందని.. బాధితులను గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. అంబులెన్స్ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.
ఇక, బరేలీ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదే సమయంలో.. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ జిల్లా అధికార యంత్రాంగాన్ని కూడా ఆదేశించారు.
