Car Crash In Mathura: శనివారం తెల్లవారుజామున మధురలోని యమునా ఎక్స్ప్రెస్ వేపై (Yamuna Expressway)పై రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ దుర్ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
Car Crash On Yamuna Expressway: ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మధురలోని యమునా ఎక్స్ప్రెస్ వేపై (Yamuna Expressway) పై వేగంగా వస్తున్న రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ దుర్ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. చనిపోయిన వారిలో ముగ్గురు మహిళలు, మరో ముగ్గురు పురుషులు, ఓ చిన్నారి ఉన్నారు.
పోలీసుల వివరాల ప్రకారం... యూపీలోని మధురలోని యమునా ఎక్స్ప్రెస్వేపై శనివారం ఉదయం జరిగిన కారు ప్రమాదంలో ఏడుగురు మరణించగా, ఇద్దరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మరణించిన వారందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. వివాహానికి హాజరైన తర్వాత హర్దోయ్ నుండి నోయిడాకు తిరిగి వస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో వారి కారు గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు వ్యక్తులు ఆస్పత్రి చికిత్స పొందుతున్నారని తెలిపారు.
పోలీస్ సూపరింటెండెంట్ (రూరల్) శ్రీష్ చంద్ర మాట్లాడుతూ.. కారులోని ప్రయాణీకులు ఉత్తరప్రదేశ్ లోని హర్దోయ్ జిల్లాకు చెందినవారని చెప్పారు. వీరు ప్రస్తుతం నివసిస్తున్న నోయిడాకు తిరిగి వస్తున్నారని పేర్కొన్నారు. "శనివారం తెల్లవారుజామున 5 గంటలకు, కారు గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టింది. కారు అధిక వేగంతో వెళుతున్నందున, ఏడుగురు వెంటనే మరణించారు.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు" అని వెల్లడించారు. మృతదేహాలను కష్టంగా కారులోనుంచి బయటకు తీశారు. మృతుల్లో చిన్నారి సహా ముగ్గురు మహిళలు ఉన్నారని చెప్పారు. మృతదేహాలను ఫోరెన్సిక్ పరీక్షకు తరలించామని, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు.
మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. "ఉత్తరప్రదేశ్లోని మధురలో జరిగిన రోడ్డు ప్రమాదం హృదయ విదారకంగా ఉంది. ఈ ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అని ప్రధాని కార్యాలయం హిందీలో ట్వీట్ చేసింది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి తగిన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
