మణిపూర్లో విషాదం: ఆర్మీ బేస్ క్యాంప్పై విరిగిపడ్డ కొండచరియలు , ఏడుగురి మృతి.. 45 మంది జవాన్లు గల్లంతు
మణిపూర్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మీ బేస్ క్యాంప్ పై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు దుర్మరణం పాలవ్వగా.. 45 మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీస్, అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
మణిపూర్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మీ బేస్ క్యాంప్ పై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు దుర్మరణం పాలవ్వగా.. 45 మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీస్, అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రిబామ్ నుండి ఇంఫాల్ వరకు నిర్మాణంలో ఉన్న రైల్వే లైన్ రక్షణ కోసం మణిపూర్లోని నోనీ జిల్లాలోని టుపుల్ రైల్వే స్టేషన్ సమీపంలో 107 టెరిటోరియల్ ఆర్మీ ఆఫ్ ఇండియన్ ఆర్మీ కంపెనీ మోహరించారు. అయితే ఈ క్యాంపుపై బుధవారం రాత్రి ఒక్క సారిగా భారీ కొండచరియలు పడ్డాయి.
ఇప్పటి వరకు మొత్తం 13 మందిని రక్షించామని .. గాయపడిన వారు నోనీ ఆర్మీ మెడికల్ యూనిట్లో చికిత్స పొందుతున్నారని ఆర్మీ ఉన్నతాధికారులు మీడియాకు తెలిపారు. తీవ్రంగా గాయపడిన సిబ్బందిని మెరుగైన చికిత్స కోసం మరో చోటికి తరలించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అయితే కొండచరియలు విరిగిపడటంతో ఇజై నది ప్రవాహానికి అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలానికి ఇండియన్ ఆర్మీ, అస్సాం రైఫిల్స్ బలగాలు చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ను ముమ్మరం చేశాయి.
అయితే కొండచరియలు విరిగిపడటం, ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. అయినప్పటికీ గల్లంతైన వ్యక్తులను రక్షించడానికి సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వాతావరణం అనుకూలించిన వెంటనే ఆర్మీ హెలికాప్టర్లు రంగంలోకి దిగనున్నాయి. కాగా కొండచరియలు విరిగిపడిన పరిస్థితిని అంచనా వేయడానికి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ ట్విట్టర్లో తెలిపారు.