ఢిల్లీలో రైతుల భద్రత కోసం 7.3 కోట్ల ఖర్చు- కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్
నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేసిన రైతుల భద్రత కోసం రూ. 7.3 కోట్లు ఖర్చు అయ్యాయని కేంద్రం తెలిపింది. ఈ మేరకు కేంద్ర సహాయ హోం మంత్రి నిత్యానంద్ రాయ్ పార్లమెంట్ లో ప్రకటన చేశారు.
నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలిపిన రైతుల భద్రత కోసం ఇప్పటి వరకు రూ.7.3 కోట్లు ఖర్చు అయ్యాయని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అన్నారు. పార్లమెంట్ లో ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ మోహ్మద్ అబ్దుల్లా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గతేడాది ఆగస్టు నుంచి రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతున్నారని ఎంపీ మోహ్మద్ అబ్దుల్లా తెలిపారు. ఇప్పటి వరకు వారి రక్షణ కోసం ఢిల్లీ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందని ఆయన ప్రశ్నించారు. దీనికి మంత్రి సమాధానం ఇచ్చారు. ఢిల్లీ పోలీసులు అందించిన సమాచారం ప్రకారం 11 నవంబర్ 2021 నాటికి ప్రభుత్వం 7,38,42,914 రూపాయిలను రైతుల రక్షణ కోసం ఖర్చు చేశారని తెలిపారు. ఈ ఆందోళనల నేపథ్యంలో ఎంత మంది రైతులు చనిపోయారని ? చనిపోయిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించారా ? ఒక వేళ చెల్లిస్తే ఎంత పరిహారం ఇచ్చారు ? ఇవ్వకపోతే దానికి కారణాలేంటి అని ఎంపీ మోహ్మద్ అబ్దుల్లా వేసిన ప్రశ్నకు కూడా మంత్రి సమాధానం ఇచ్చారు. శాంతి భద్రతలు అనేవి రాష్ట్ర ప్రభుత్వ అంశాలని తెలిపారు. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ ప్రకారం ఆ అంశం రాష్ట్ర జాబితాలోకి వస్తుందని తెలిపారు. నష్టపరిహారం విషయంలో ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
https://telugu.asianetnews.com/national/immediate-suspension-of-all-cases-centre-r3sp2g
గతేడాడి నుంచి ఆందోళనలు..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతులు నష్టాన్ని కల్గిస్తాయని చెపుతూ రైతులు గతేడాది నుంచి ఆందోళన చేస్తున్నారు. ఈ వ్యవసాయ చట్టాల విషయంలో పలువురు సుప్రీం కోర్టుకు వెళ్లారు. దీంతో నూతన వ్యవసాయ చట్టాలపై స్టే విధించింది. పూర్తిగా రద్దు చేసేంత వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని చెబుతూ పంజాబ్, హర్యానకు చెందిన వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. అక్కడే గుడారాలు వేసుకొని ఉంటున్నారు. ప్రతిపక్షాలు కూడా ఈ చట్టాల విషయంలో తీవ్ర అభ్యంతరాలు తెలిపాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఆ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయంలో రైతులకు క్షమాపణలు చెప్పారు. రైతుల మేలు కోసమే ఈ చట్టాలు తీసుకొచ్చామని అయితే ఈ చట్టాల వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు అర్థమయ్యేలా చేయడంలో విఫలమయ్యామని చెప్పారు. వెంటనే ఈ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే ఈ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మూజువాణి ఓటుతో ఆ తీర్మాణాన్ని ఆమోదించింది.