కల్తీ మద్యం.. 66కి చేరిన మృతుల సంఖ్య
అస్సాంలో దారుణం చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 66కి చేరింది.
అస్సాంలో దారుణం చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 66కి చేరింది. వేడుకలో భాగంగా మద్యం సేవించి వీరంతా మృత్యువాత పడటం గమనార్హం.
పూర్తి వివరాల్లోకి వెళితే... గోలాఘాట్ లోని సల్మారా టీ ఎస్టేట్ లో పనిచేస్తున్న కూలీలు గురువారం రాత్రి వేడుక చేసుకున్నారు. వేడుకలో భాగంగా మద్యం తెచ్చుకొని తాగారు. మద్యం తాగిన కాసేపటికే నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యంలోనే 12మంది చనిపోయారని పోలీసులు తెలిపారు.
మిగిలిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వారు తాగిన మద్యంలో విషం కలిసిందని.. అందుకే చనిపోయారని వైద్యులు నిర్దారించారు. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాదాపు 70 మందికి పైగా వేడుకలో పాల్గొని విషపూరిత మద్యం సేవించినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు ఉండటం గమనార్హం.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. మద్యాన్ని రసాయనాల క్యాన్లో తీసుకురావడం వల్లే అది విషపూరితమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కల్తీ మద్యం కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.