భార్యకు క్యాన్సర్.. సైకిల్ పై కూర్చోపెట్టుకొని 120కిమీ..
సైకిల్ పై భార్యను కూర్చోపెట్టుకొని దాదాపు 120కిలోమీటర్లు ప్రయాణించాడు. అయితే.. ఆయన చేసిన సాహాసానికి ఫలితం దక్కలేదు. అంత దూరం సైకిల్ తొక్కి మరీ భార్యను ఆస్పత్రికి తీసుకువెళ్లినా.. ఆమె ప్రాణాలతో బయటపడలేదు
కళ్ల ముందు భార్య క్యాన్సర్ తో పోరాటం చేస్తోంది. ఆమెను కాపాడుకునే సత్తువ, సంపద ఆయన దగ్గర లేదు. కానీ.. అలా అని చూస్తూ ఊరుకోలేదు. తన శక్తికి మించిన సాహసం చేశాడు. తాను వృద్ధుడిననే విషయాన్ని మరిచిపోయి మరీ... సైకిల్ పై భార్యను కూర్చోపెట్టుకొని దాదాపు 120కిలోమీటర్లు ప్రయాణించాడు. అయితే.. ఆయన చేసిన సాహాసానికి ఫలితం దక్కలేదు. అంత దూరం సైకిల్ తొక్కి మరీ భార్యను ఆస్పత్రికి తీసుకువెళ్లినా.. ఆమె ప్రాణాలతో బయటపడలేదు. ఈ విషాదకర సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలోని మనల్మేడుకు చెందిన అరివళగన్ (60) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మొదటి భార్య మరణించడంతో మంజుల (44)ను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమారుడు విష్ణు (12) ఉన్నాడు. మంజుల ఎడమచెంపకు సమీపంలో క్యాన్సర్ వ్యాధి సోకినట్లు తొమ్మిది నెలల క్రితం గుర్తించారు.
పుదుచ్చేరి జిప్మర్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. మార్చి 24వ తేదీ నుంచి లాక్డౌన్ ఉండడంతో ఆస్పత్రికి వెళ్లలేకపోయారు. ఈ పరిస్థితిలో భార్య బాధను చూసి తట్టుకోలేకపోయిన అరివళగన్ మార్చి 29వ తేదీన పాత సైకిల్పై ఆమెను కూర్చోబెట్టుకుని కుంభకోణం నుంచి బయలుదేరాడు. 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుదు చ్చేరిలోని జిప్మర్ ఆస్పత్రిలో చేర్పించాడు. తరువాత అంబులెన్స్లో ఆమెను తిరిగి స్వగ్రామానికి చేర్చా డు.
భార్య ఆరోగ్యం పట్ల అతడు చూపిస్తున్న ప్రేమను గ్రామస్తులు మెచ్చుకుని తోచిన సహాయాన్ని చేశారు. ఇంట్లోనే ఉంటూ మందులు తీసుకుంటున్న మంజుల ఆదివారం రాత్రి మరణించింది.
‘లాక్డౌన్ కారణంగా ఉపాధి కరువైంది, మరోవైపు క్యాన్సర్తో భార్య బాధపడుతోంది. ఆస్పత్రికి తీసుకెళదామంటే బస్సులు లేవు. భార్య ను కాపాడుకునేందుకు సైకిల్పైనే ఆసుపత్రికి తీసుకెళ్లాను. నా కష్టం వృథా పోయింది. భార్య ప్రాణా లు నిలబెట్టుకోలేక పోయాను’ అంటూ అతను కన్నీరు పెట్టుకున్నాడు. కాగా.. అతని బాధ స్థానికులను కలచివేసింది.