Asianet News TeluguAsianet News Telugu

రాజస్థాన్ బస్సీ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం: ఆరుగురు మృతి


రాజస్థాన్ బస్సీలోని కెమికల్ ఫ్యాక్టరీలో  అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాదానికి బాయిలర్ పేలుడు కారణమని అధికారులు ప్రకటించారు.

6 Killed, 1 Injured As Fire Breaks Out At Chemical Factory In Jaipur lns
Author
First Published Mar 24, 2024, 6:41 AM IST

జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ జిల్లా బస్సిలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో శనివారం నాడు రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు.

ఈ ఫ్యాక్టరీలోని బాయిలర్ లో పేలుడుతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని  జైపూర్ జిల్లా కలెక్టర్ రాజ్ పురోహిత్ చెప్పారు. ఈ ప్రమాదంలో 95 శాతం గాయాలతో  జైపూర్ సవాయ్ మాన్ సింగ్ ప్రభుత్వాసుపత్రిలో  ఇద్దరిని చేర్పించారు. 

అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మరణించినట్టుగా  అధికారులు ప్రకటించారు.65 శాతం గాయాలతో  మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాయిలర్ పేలగానే  ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారని  జైప్ పోలీస్ కమిషనర్ బిజు జార్జ్ జోసెఫ్ చెప్పారు.  ఈ ప్రమాదం విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని  మంటలను ఆర్పివేశారు.

ఈ ఘటన జరిగిన తర్వాత స్థానికులు, మృతుల కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని  ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.  బాధిత కుటుంబాలకు అన్ని రకాల సహాయం అందించాలని  సీఎం అధికారులను ఆదేశించారు.

జైపూర్ సమీపంలోని బస్సీలో కెమికల్ ఫ్యాక్టరీలో  అగ్ని ప్రమాదంలో  పౌరులు మరణించడం బాధాకరమని సీఎం సోషల్ మీడియాలో  ప్రకటించారు.  అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారన్నారు. బాధితులను ఆదుకొంటామని సీఎం భజన్ లాల్ శర్మ పేర్కొన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షను వ్యక్తం చేశారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios