కేరళలో ఘోర రోడ్డుప్రమాదం.. ఇస్రో క్యాంటీన్లో పనిచేస్తున్న ఐదుగురు మృతి..
కేరళలోని అలప్పుజా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. లారీ- కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతిచెందారు.
కేరళలోని అలప్పుజా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. లారీ- కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతిచెందారు. వివరాలు.. సోమవారం తెల్లవారుజామున అలప్పుజా జిల్లా అంబలపుజా సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బియ్యం లోడుతో ఆంధ్రప్రదేశ్ నుంచి అలప్పుజకు వెళ్తున్న లారీ.. తిరువనంతపురం వైపు వెళ్తున్న కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఇక, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన చోటుకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను అలప్పుజా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి శవపరీక్ష నిమిత్తం తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారులో ఉన్న ఐదుగురిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులను ప్రసాద్, షిజు, అమల్, సచిన్, సుమోద్లుగా గుర్తించారు. వీరు తిరువనంతపురంలోని ఇస్రో క్యాంటీన్లో పనిచేస్తున్నారు. ఇక, ఈ ప్రమాదానికి సంబంధించి లారీ డ్రైవర్, సహాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.