మహారాష్ట్రలోని పుణె- ముంబై ఎక్స్ ప్రెస్ హైవేపై ఇవాళ ప్రమాదం జరిగింది. పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడింది.ఈ ప్రమాదంలో ట్యాంకర్ కు మంటలు అంటుకొని నలుగురు మృతి చెందారు.
ముంబై: మహారాష్ట్రలో మంగళవారంనాడు విషాదం చోటు చేసుకుంది. పుణె-ముంబై ఎక్స్ ప్రెస్ హైవేపై పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఆయిల్ ట్యాంకర్ కు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.పుణె-ముంబై ఎక్స్ ప్రెస్ హైవేపై లొనావాల ఖండావాలా మధ్య ఈ ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడి మంటలంటుకున్నాయి. దీంతో ఆయిల్ ట్యాంకర్ మంటల ధాటికి పేలింది. పేలుడు ధాటికి వాహనం భాగాలు రోడ్డుపై వెళ్తున్న వారిపై పడ్డాయని అధికారులు చెప్పారు.
దీంతో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఘటన స్థలంలోనే ఆయిల్ ట్యాంకర్ కు అంటుకున్న మంటలను ఆర్పివేశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో హైవేపై ఒక వైపు మాత్రమే వాహనాలను అనుమతించారు పోలీసులు.బండరాయిని ఢీకొని పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడిందని అధికారులు గుర్తించారు.మంగళవారంనాడు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.
జైపూర్-బికనీర్ హైవేపై వ్యాన్ ,ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెంది, మరో 9 మంది గాయపడిన ఘటన జరిగిన మరునాడే ఈ ఘటన చోటు చేసుకుంది. ఫతేపూర్ నుండి సికార్ కు నిశ్చితార్ధ వేడుకకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
