ముంబై విమానాశ్రయంలో రూ.47 కోట్ల విలువైన హెరాయిన్, కొకైన్ స్వాధీనం.. ఇద్దరు స్మగ్లర్ల అరెస్టు
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రెండు వేర్వేరు కేసుల్లో ₹31.29 కోట్ల విలువైన 4.47 కిలోగ్రాముల హెరాయిన్ మరియు ₹15.96 కోట్ల విలువైన 1.59 కిలోల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు.
మాదక ద్రవ్యాలు, బంగారం ఇతర వస్తువులను దేశంలోకి అక్రమంగా తరలించాలని స్మగ్లర్లు చేయని ప్రయత్నం లేదు. వాళ్లు ఎన్ని ఎత్తులు వేసినా కస్టమ్స్ అధికారులు పైఎత్తులు వేస్తూ స్మగ్లర్ల ఆటకట్టిస్తున్నారు. తాజాగా రెండు వేర్వేరు కేసుల్లో కోట్ల విలువైన హెరాయిన్, కొకైన్ను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో అడ్డంగా దొరికిపోయారు. వివరాల్లోకెళ్లే.. రూ. 47 కోట్ల విలువైన హెరాయిన్, కొకైన్తో తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం అరెస్టు చేశారు. ముంబై ఎయిర్పోర్ట్ కస్టమ్స్ జోనల్ యూనిట్ 3 ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్లో రూ.31.29 కోట్ల విలువైన 4.47 కిలోల హెరాయిన్, రూ.15.96 కోట్ల విలువైన 1.596 కిలోల కొకైన్ను స్వాధీనం చేసుకున్నట్లు ఓ అధికారి తెలిపారు.
మొదటి కేసులో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ నుండి కెన్యాలోని నైరోబీ మీదుగా కెన్యా ఎయిర్వేస్ విమానంలో ఇక్కడకు వచ్చినప్పుడు 4.47 కిలోల హెరాయిన్తో ఒక వ్యక్తి పట్టుబడ్డాడు. అతను 12 డాక్యుమెంట్ ఫోల్డర్లలో నిషిద్ధ వస్తువులను దాచాడు. మరో కేసులో.. ఇథియోపియన్ ఎయిర్లైన్స్ విమానంలో వచ్చిన ఒక వ్యక్తి అతని లగేజీని స్కాన్ చేయగా అనుమానాస్పద బటన్లు కనిపించడంతో పట్టుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ బటన్లు అధిక సంఖ్యలో ఉన్నాయి మరియు వస్త్రంపై అసాధారణంగా ఒకదానికొకటి దగ్గరగా ఉంచబడ్డాయి.
బ్యాగ్ను క్షుణ్ణంగా పరిశీలించగా, కుర్తా బటన్లు , మహిళల హ్యాండ్బ్యాగ్లలోని నకిలీ కావిటీస్లో దాగి ఉన్న 1.596 కిలోల కొకైన్ రికవరీకి దారితీసిందని అధికారి తెలిపారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (ఎన్డిపిఎస్) చట్టంలోని నిబంధనల ప్రకారం ఇద్దరిపై అభియోగాలు మోపామని, 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపామని వారు తెలిపారు.
ముగ్గురు డ్రగ్స్ వ్యాపారులను అరెస్టు
మహారాష్ట్రలోని యాంటీ నార్కోటిక్స్ సెల్ అంబర్నాథ్ ప్రాంతంలో ముగ్గురు డ్రగ్స్ వ్యాపారులను అరెస్టు చేసి అంతర్జాతీయ మార్కెట్లో రూ.17 లక్షల విలువైన 90 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు చిరువ్యాపారులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.